సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో సూపర్గా రాణించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన డర్బన్ కెప్టెన్ క్వింటన్ డీ కాక్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఇలా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ ఆడమ్ రస్సింగ్టన్ (30 బంతుల్లో 72) ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను రనౌట్ అయ్యాడు.
మరో ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (59) కూడా రాణించాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 నాటౌట్) చక్కని ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో ట్రిస్టియన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్) ధనాధన్ ఆటతీరు కనబరిచాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్బన్ బౌలర్లలో డ్వెయిన్ ప్రిటోరియస్ ఒక్కడే ఒక వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు. ఓపెనర్లు కైల్ మేయర్స్ (11), మాథ్యూ బ్రీజీ (3) ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వియాన్ ముల్డర్ (29) ఫర్వాలేదనిపించినా.. అతన్ని మార్కో జాన్సెన్ అవుట్ చేశాడు. హెన్రిక్ క్లాసెన్ (1), క్వింటన్ డీకాక్ (0), జేసన్ హోల్డర్ (7), డ్వెయిన్ ప్రిటోరియస్ (3), కీమో పాల్ (7), ప్రనేలెన్ సుబ్రయాన్ (4), అకిల దనంజయ (4), కేశవ్ మహరాజ్ (12 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. సన్రైజర్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్ ఏకంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.