హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో ప్రయోగాల సమయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలువురు కీలక ఆటగాళ్లను పక్కకు పెట్టడంపై గవాస్కర్ తనదైన శైలిలో స్పందించాడు.
ఆటగాళ్ల ఫామ్ కంటే కూడా వారి హెయిర్ స్టైల్ బాగుంటేనే జట్టులో ఎంపిక చేస్తారేమో అంటూ ఛలోక్తులు విసిరాడు. 'శ్రీలంక పర్యటనలో పలువురు ప్రధాన ఆటగాళ్లను పరీక్షించాల్సి ఉన్నా వారిని పట్టించుకోలేదు. ఇక్కడ వారి ఫామ్ కంటే కూడా హెయిర్ నచ్చాలేమో. ఎవరైతే వైవిధ్యమైన హెయిర్ స్టైల్ తో ఉంటారో వారినే జట్టులో ఎంపిక చేస్తారేమో' అని సన్నీ వ్యాఖ్యానించాడు.
'టీమ్ అనుకున్నట్లే మార్పులు చేసింది. చాలా మంది ఆటగాళ్లను పరీక్షించాల్సి ఉన్నా కనీసం వారిని ఎంపిక చేయలేదు. అయితే భువీ, కేదార్ జాదవ్, చాహల్ను తొలగిస్తారనుకోలేదు. రాహుల్కు మరో అవకాశం ఇచ్చారు. వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్న రహానేను పక్కనపెట్టారు' అని గవాస్కర్ ధ్వజమెత్తాడు.

దీనిని బట్టి చూస్తుంటే జట్టులో ఎంపిక కావాలంటే ఆయా ఆటగాళ్లు ఇక నుంచి భిన్నమైన హెయిర్ స్టయిల్స్తో కనిపించడం మొదలు పెట్టాలని సూచించాడు. ఆటగాళ్ల ఫామ్ కంటే హెయిర్ స్టైల్ ముఖ్యమయ్యేలా కనిపిస్తోందంటూ గవాస్కర్ కాస్త వ్యంగ్యంగానే స్పందించాడు. లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా భిన్నమైన హెయిర్ స్టైల్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్కి బదులు హార్దిక్ పాండ్యా రావడాన్ని కూడా గవాస్కర్ తప్పుబట్టాడు. ఓ ఫామ్లోలేని బ్యాట్స్మన్ మళ్లీ ఫామ్లోకి రావాలని ఆశించడంలో తప్పు లేదు గానీ.. అతని కోసం ఓ ఫామ్లో ఉన్న మరో బ్యాట్స్మన్ (రహానే)ను పక్కనపెట్టడం ఎంతవరకు న్యాయం అని గవాస్కర్ ప్రశ్నించాడు.
కాగా, 2019 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని పరిమిత ఓవర్ల జట్టును ఎంపిక చేశామని చెబుతున్న సెలక్టర్లు వెటరన్ ప్లేయర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీలంక పర్యటకను జట్టులో చోటు దక్కించుకున్న రహానే ఇప్పటివరకూ ఒక్క వన్డే కూడా ఆడక పోవడం విశేషం.