
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన శ్రీలంక-భారత్ మూడో టెస్ట్లో భారత్ ఆటగాళ్ల తీరు పలువురిని నిరాశకు గురి చేసింది. కామెంటేటర్ల దగ్గర్నుంచి నెటిజన్ల వరకు అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు.
ఈ మ్యాచ్కు కామెంటేటర్ గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ మ్యాచ్ మధ్యలో ఓ సారి బౌండరీ లైన్ వద్ద బంతి ఆపేందుకు వెళ్తున్న పుజారాను ఉద్దేశించి 'కారు హ్యాండ్ బ్రేక్ వేస్తే ఎలా నెమ్మదిగా వెళ్తుందో.. పుజారా అలా వెళ్తున్నాడు'అంటూ పెదవి విరిచాడు. అలాగే అశ్విన్ను ఉద్దేశించి 'వికెట్లు తీసేందుకు శతవిధాల ప్రయతిస్తున్నారు. కానీ, విజయవంతం కాలేకపోతున్నారు' అని అన్నాడు.
మ్యాచ్లో విరాట్ కోహ్లీ, జడేజా మాత్రమే మైదానంలో చురుకుగా ఉన్నారని పలువురు అభిప్రాయపడ్డారు. మూడో టెస్ట్ మొత్తంగా శ్రీలంక వికెట్లు పడగొట్టడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ఫీల్డింగ్లో కోహ్లి, జడేజాలేనా ఉన్నది అన్నట్లుగా ఉందంటూ పలువురు విమర్శించారు. బుధవారం 87 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ మ్యాచ్లో అశ్విన్కు నాలుగు వికెట్లు దక్కగా.. పుజారా తొలి ఇన్నింగ్స్లో 23, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు నమోదు చేశాడు. ఈ టెస్టు డ్రాగా ముగియడంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-0తో భారత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.