

హైదరాబాద్: జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆ దేశ ప్రధాని అవుతున్న వేళ భారత క్రికెట్ దిగ్గజాలను ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించాడు. ఈ వేడుకకు హాజరవడం ద్వారా ఎన్నాళ్లుగానో మ్యాచ్కు దూరమైన పాక్-ఇండియాల మధ్య సత్సంబంధాలు చిగురుస్తాయని ఎంతో మంది ఆశపడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితులలో సునీల్ గవాస్కర్ కూడా ఒకరు.
ఈ ఆహ్వానం మేరకు తాను హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని తెలియజేశారు. మరి కొద్ది రోజుల్లోనే తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగస్టు 11న ఉంటుందంటూ తొలుత వినిపించినా అదింకా ఖరారు కాలేదు.
తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఆగస్టు 14న ప్రమాణ స్వీకారం చేయాలని ఆపద్ధర్మ ప్రధాని నసీరుల్ ముల్క్ ఉద్దేశమంటూ పేర్కొన్నారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని మంత్రి ప్రకటించారు. అంటే ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారన్న మాట.
కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆఫీసు నుంచి ఆహ్వానం అందిందనీ తెలిపిన గవాస్కర్.. ఏదేనీ కారణాల వల్ల కార్యక్రమం ఆగస్టు 15కు వాయిదా పడితే మాత్రం తాను హాజరు కాలేనని చెప్పారు. అదే రోజు తన తల్లి పుట్టిన రోజు, భారత స్వాతంత్ర్య దినం కావడం.. మరోవైపు టెస్టు మ్యాచుల్లో కామెంటరీ కోసం ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉండడంతో పాక్కు వెళ్లలేనని తెలిపారు. 1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిపొందిన విషయం అందరికీ తెలిసిందే. టోర్నీ అనంతరం పాకిస్తాన్లో జరిగిన ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో గావస్కర్ కూడా పాల్గొన్నారు.