ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. 16 మంది సభ్యులలో జైషాకు 15 మంది మద్దతు ఉంది. కాగా, ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయడానికి మంగళవారమే ఆఖరి రోజు. దీంతో జై షా ఐసీసీ చీఫ్ పదవికి పోటీ చేయనున్నాడా లేదా అనే విషయంపై నేడు క్లారిటీ వస్తుంది.
మరోవైపు జై షాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లేను పదవి నుంచి వైదొలగాలని జై షా ఒత్తిడి చేశాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇకపై ఆధిపత్యం చెలాయించడానికి కుదరదనే ఉద్దేశంతో కొన్ని 'పాత శక్తులు' ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని గవాస్కర్ మండిపడ్డాడు.

అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఐసీసీ సమావేశాల్లో మాట్లాడాల్సిందని, తమ వాదనలు వినిపించాల్సిందని గవాస్కర్ అన్నాడు. కానీ సమావేశాల్లో తమ ప్రతినిధులు ఏమీ మాట్లాడకుండా, ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించాడు. ఈ పరిస్థితి 'టాల్ ఆఫ్ సిండ్రోమ్'కి ఉదాహరణ అంటూ విమర్శకులను గవాస్కర్ ఎద్దేవా చేశాడు. ఐసీసీ ఛైర్మన్ పదవికి జై షా అర్హుడని, భారత క్రికెట్లో మెన్స్, ఉమెన్స్ క్రికెట్లో జరిగిన గొప్ప మార్పులు ప్రపంచ క్రికెట్లో జరుగుతాయని గవాస్కర్ అన్నాడు.
నిబంధనల ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఐసీసీ ఛైర్మన్గా ఎవరైనా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మరో రెండేళ్లు ఛైర్మన్ పదవికి పోటీపడే అవకాశం ఉన్నప్పటికీ, ఆసక్తి లేదని బార్క్లే స్పష్టం చేశాడు. కానీ అంతర్జాతీయ మీడియాలో..పదవి నుంచి తప్పుకోవాలని బార్క్లేపై 35 ఏళ్ల జైషా ఒత్తిడిచేశాడని కథనాలు వచ్చాయి.
కాగా, ఐసీసీ ఛైర్మన్గా జై షా ఎన్నికైతే.. ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా జై షా రికార్డుకెక్కనున్నారు. అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన అయిదో భారతీయుడిగా నిలవనున్నారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.