IND vs NZ: రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. డారిల్ మిచెల్ (131 నాటౌట్) వీరోచిత సెంచరీతో కివీస్ జట్టు 285 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. అయితే టీమిండియా ఓటమిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలవడంపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కివీస్ జట్టు ఇంత సులభంగా ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని ఆయన విశ్లేషించారు.
పిచ్ అనుకూలించినా ప్రయోజనం లేదు
రాజ్కోట్ పిచ్ స్లోగా ఉండటం భారత్కు కలిసివస్తుందని అందరూ భావించారని, కానీ కివీస్ బ్యాటర్లు దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. "కివీస్ బ్యాటింగ్ ప్రారంభించకముందు, టీమిండియా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. మన స్పిన్నర్లు కివీస్ను 260 పరుగుల లోపే కట్టడి చేస్తారని ఆశించాను. కానీ వారు ఎక్కడా ఒత్తిడికి లోనవకుండా మ్యాచ్ను లాగేసుకున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

ప్రయోగాలకు ఇక చోటు లేదు..
ఈ ఓటమి వల్ల ఇండోర్లో జరిగే నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. "భారత్ రెండో వన్డే గెలిచి ఉంటే, మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేసే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సిరీస్ ప్రమాదంలో పడింది. ఇక ప్రయోగాలు చేసే సాహసం చేయలేరు. ఖచ్చితంగా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్తోనే బరిలోకి దిగాలి" అని ఆయన హెచ్చరించారు.
కుల్దీప్, జడేజా విఫలం
కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా 8 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చాడు, కానీ వికెట్ తీయలేకపోయాడు. మిచెల్ తన రివర్స్ స్వీప్స్, ఫుట్ వర్క్తో కుల్దీప్ ఫామ్ను దెబ్బతీశాడని మాజీ క్రికెటర్ సైమన్ డూల్ కూడా ప్రశంసించారు.