ఐపీఎల్-2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లకు దక్కే అవకాశాలు, వచ్చే గుర్తింపు ఓ రేంజులో ఉంటుంది. అందుకే ఐపీఎల్లో రాణించాలని ప్లేయర్లు తహతహలాడుతుంటారు. అలాగే దేశ జట్టులో చోటు కోల్పోయిన వాళ్లు మళ్లీ స్థానం కోసం ఐపీఎల్లో రాణించడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో చాలా మంది దేశీయ ప్లేయర్లు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పర్పుల్ క్యాప్ రేసులో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సన్రైజర్స్ బౌలర్ నటరాజన్.. తన మార్క్ బౌలింగ్తో, నిప్పులు చెరిగే యార్కర్లతో సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ చాహల్ 18వికెట్లతో పర్పుల్ క్యాప్ పొందగా.. ఈ క్యాప్ రేసులో 15వికెట్లతో నటరాజన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లు అరివీర భీకరంగా బౌలింగ్ చేసి 68పరుగులకే ఆర్సీబీని ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్లో నటరాజన్ ఆర్సీబీ మిడిల్, లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. 3ఓవర్లో కేవలం 10పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ దిగ్గజం, విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ నటరాజన్ ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. నట్టూ బౌలింగ్ పటిమను కొనియాడుతూ.. తప్పకుండా త్వరలో జరగబోయే ప్రపంచకప్కు ఎంపికయ్యేవాళ్లలో అతను ఉంటాడని గవాస్కర్ పేర్కొన్నాడు.
సునీల్ గవాస్కర్ నట్టూ ప్రదర్శనపై స్పందిస్తూ.. 'గత సీజన్లో ఇంజూరీ కారణాల వల్ల నటరాజన్ తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు. కానీ ఈ సీజన్లో మాత్రం నట్టూ తన అసలు సిసలు బౌలింగ్ పదును చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యే భారత జట్టులో నట్టూ ఉంటాడని భావిస్తున్నా.. అతని పేస్ పదును, డెలివరీలు చూస్తుంటే వరల్డ్కప్ కోసం అతను ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయం' అని గవాస్కర్ అన్నాడు.
కాగా నిన్న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ హైదరబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10) మూడేసి వికెట్లు తీయగా.. జగదీష్ సుచీత్(2/12) రెండు వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దెబ్బతీశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది.