
హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది. టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండగా... వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, 1960, 70ల్లో అలా కాదు. భారత జట్టుని అసలు జట్టుగానే పరిగణించే వారు కాదు.
వెస్టిండిస్ వంటి జట్లతో మ్యాచ్ ఆడేటప్పుడు భారత జట్టుని అండర్ డాగ్స్గా పిలిచేవారు. అలాంటి సమయంలో భారత క్రికెట్ దశ దిశను ఇద్దరు క్రికెటర్లు పూర్తిగా మార్చివేశారు. ఆ ఇద్దరే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్. వీరిద్దరూ తమ అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాను మేటి జట్లలో ఒకటిగా నిలిపారు.
1980ల్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా సునీల్ గవాస్కర్ కొనియాడబడితే... వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్గా కపిల్ దేవ్ కీర్తింపబడ్డాడు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయో, అందులో నిజమెంతో తాజాగా స్పోర్ట్స్ స్టార్కు రాసిన కాలమ్లో సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
"1984-85 సిరీస్లో ఇంగ్లాండ్తో కలకత్తా టెస్టుకు కపిల్ దేవ్కు చోటు దక్కలేదు. అప్పుడు చాలా మంది నన్ను నిందించారు. కపిల్ వద్దని నేను ప్రతిపాదించలేదు. అసలు నిజమేంటంటే అప్పటి సెలక్టర్ హనుమత్ సింగ్ అతడిని ఎంపిక చేయలేదు. ఏడాది తర్వాత ఓ కథనంలో హనుమత్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా రాశారు" అని సన్నీ చెప్పుకొచ్చారు.
అలా మా ఇద్దరి మధ్య విభేదాలున్నాయని అప్పట్లో ప్రచారం చేశారు. కపిల్ను తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన తనది కాదని... కపిల్ మ్యాచ్ విన్నర్ అని, గేమ్ ఛేంజర్ను వదులుకొమని నేనెందుకు సలహా ఇస్తానని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
"గేమ్ విషయంలో నేనంత మూర్ఖుడిని కాను. నా జట్టులో ఉన్న ఒకే మ్యాచ్ విన్నర్, గేమ్ ఛేంజర్ను వదులుకొనేందుకు నేనెందుకు సలహా ఇస్తాను. భారత్ గెలిచే అవకాశాలను ఎందుకు తగ్గించుకుంటాను. ఏదేమైనప్పటికీ అప్పుడు సెలక్షన్ కమిటీ నిర్ణయానికి నేనే బాధ్యుడిని" అని గవాస్కర్ తెలిపాడు.