Sunil Gavaskar: ఐపీఎల్కు, రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్లకు మధ్య భారీ వ్యత్యాసంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు లభించే గుర్తింపు, జీతాలలో ఈ అసమానత స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఎత్తి చూపారు. స్పోర్ట్స్టార్ మేగజైన్ లో రాసిన ఒక వ్యాసంలో సునీల్ గవాస్కర్ భారత క్రికెట్పై ఐపీఎల్ సిరీస్ ప్రభావంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను అభివృద్ధి చేయడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది తెలియని ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చిన ఘనత ఐపీఎల్ కు ఉందని ఆయన అన్నారు.
ఐపీఎల్, దేశీయ క్రికెట్ మధ్య తేడాపై ఆందోళన
అయితే ఐపీఎల్, దేశీయ పోటీలలో ఆటగాళ్ల ప్రదర్శనలను ఎలా చూస్తారో, వారికి ప్రతిఫలం ఇచ్చే విధానంలో పెద్ద వ్యత్యాసాన్ని సునీల్ గవాస్కర్ ఎత్తిచూపారు. ఐపీఎల్ లో ఒక మంచి ప్రదర్శన తెలియని ఆటగాడిని కూడా గొప్ప గుర్తింపు, ఉన్నత అవకాశాలను అందిస్తుంది. ఇది రంజీ ట్రోఫీకి పూర్తి విరుద్ధమని. ఇక్కడ మంచి ఆటగాళ్లు కూడా వార్తల్లో నిలిచేందుకు ఇబ్బంది పడుతున్నారని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని సునీల్ గవాస్కర్ ఉదహరించారు. భారత సాంప్రదాయ దేశీయ పోటీలలో నిలకడగా రాణించే ఆటగాళ్లకు అలాంటి అవకాశాలు లభించడం చాలా అరుదని చెప్పుకొచ్చారు. ఆర్థిక అసమతుల్యతను కూడా గవాస్కర్ ఎత్తి చూపారు. రంజీ, విజయ్ హజారే లేదా సయ్యద్ ముష్తాక్ అలీ సిరీస్ లో అయినా ఆడే ఆటగాళ్లకు.. ఐపీఎల్ ఆడే ఆటగాళ్ల సంపాదనలో చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక ఆటగాడికి జీవితాంతం రంజీ ట్రోఫీ ఆడి సంపాదించే దానికంటే ఎక్కువ డబ్బు ఐపీఎల్లో ఒకే సీజన్లో సంపాదించవచ్చని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని గవాస్కర్ అన్నారు. స్థానిక పోటీలలో కష్టపడి ఆడే ఆటగాళ్ల పరిస్థితి దారుణంగా ఉందని కూడా ఆయన అన్నారు.
దీనికి పరిష్కారంగా రాష్ట్ర క్రికెట్ సంఘాలు స్థానిక ఆటగాళ్లకు తమ మద్దతును పెంచాలని గవాస్కర్ సూచించారు. ముంబై వంటి ఇతర రాష్ట్ర క్రికెట్ సంఘాలు కూడా రంజీ ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లించే జీతాలకు సమానమైన జీతాలను చెల్లిస్తే ఈ అసమతుల్యతను కొంతవరకు తగ్గించవచ్చని గవాస్కర్ సూచించారు. ఐపీఎల్ సిరీస్ ప్రయోజనాలను గవాస్కర్ ధృవీకరించినప్పటికీ ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశంలోని ప్రధాన దేశీయ పోటీలకు వాటి గౌరవం, ప్రాముఖ్యతను తిరిగి ఇవ్వాలని.. అన్ని ఫార్మాట్లలో స్థిరంగా మంచి ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని సునీల్ గవాస్కర్ అన్నారు.