టీ20 వరల్డ్ కప్ను భారత్ ఆల్రౌండ్ షోతో అదిరేలా ఆరంభించింది. న్యూయార్క్ వేదికగా నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్షదీప్ సింగ్ (2/35) సత్తాచాటారు.
అనంతరం భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (36 నాటౌట్, 26 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అయితే ఛేదనలో విరాట్ కోహ్లి ఆదిలోనే ఔటయ్యాడు. అయిదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసిన కోహ్లి మార్క్ అడైర్ బౌలింగ్లో వెనుదిరిగాడు.

టీ20 ప్రపంచకప్ ఛేదనలో కోహ్లి త్వరగా ఔటవ్వడం ఇదే ప్రథమం. పొట్టి కప్లో ఛేజింగ్లో ఛేజ్ మాష్టర్కు మెరుగైన రికార్డు ఉంది. గత ఛేదనల్లో కోహ్లి 78*, 36*, 54, 57*, 72*, 23, 55*, 82 పరుగులు సాధించాడు. అయితే పసికూన ఐర్లాండ్తో మ్యాచ్లో కోహ్లి తొందరగా ఔటవ్వడం భారత్కు మంచిదని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ కసితో తర్వాత జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్లో విరాట్ విధ్వంసం సృష్టిస్తాడని తెలిపాడు. తక్కువ స్కోరుకు ఔటైతే స్టార్ ప్లేయర్లు తర్వాతి మ్యాచ్లో భారీ స్కోరు సాధించేలా సన్నద్ధమవుతారని పేర్కొన్నాడు.
''గ్రేట్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్, జో రూట్లను గమనించాను. వాళ్లు ఓ మ్యాచ్లో విఫలమైతే తర్వాతి మ్యాచ్లో తప్పక సత్తాచాటాలని ప్రయత్నిస్తుంటారు. రెట్టింపు పరుగులు చేయాలని చూస్తుంటారు. కాబట్టి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి వికెట్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. తర్వాత పోరులో పాకిస్థాన్పై చెలరేగాలని కోహ్లి ఆలోచిస్తుంటాడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.