మరో రెండు వారాల్లో టెస్టు ఫార్మాట్ సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబర్లో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ తలపడనుంది. స్వదేశంలో జరిగే ఈ రెండు సిరీస్ల్లో భారతే హాట్ ఫేవరేట్. అయితే నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
ఈ బోర్డర్-గవాస్కర్ సిరీస్లో విజేతగా నిలిచేది ఎవరు? జట్ల బలాబలాల గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. తమ జట్టే గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాపై భారత్ 3-1తో విజయం సాధిస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. టెస్టు ఫార్మాట్ ఎంత గొప్పదో ఈ సిరీస్ నిరూపిస్తుందని, ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందని పేర్కొన్నాడు.

''ఈ సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. ఇరు జట్లలో ఎంతో నైపుణ్యం ఉంది. ఈ ఆటలో టెస్టు ఫార్మాట్ అత్యంత గొప్ప ఫార్మాట్ అని ఈ సిరీస్ నిరూపిస్తుంది. ఈ అయిదు టెస్టుల సిరీస్ను 3-1తో భారత్ విజయం సాధిస్తుంది. ఇక డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్తో ఆస్ట్రేలియా బ్యాటింగ్లో సమస్యలు తీవ్రమయ్యాయి. మిడిల్ ఆర్డర్ కూడా ఫామ్లో లేదు''
''మరోవైపు భారత్.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేన) దేశాల్లో స్లో స్టార్టర్గా ఉంటుంది. కాబట్టి తొలి టెస్టు ఎంతో కీలకం. అంతకముందు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఎక్కువగా ఆడకపోవడం, కొన్ని టెస్టు మ్యాచ్ల మధ్య వారాల విరామం రావడంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గతేడాది సౌతాఫ్రికాలో యశస్వీ జైస్వాల్ వంటి యువ ప్లేయర్కు సవాలుగా మారింది. కానీ ఆ తర్వాత అతను అద్భుతంగా పుంజుకుని ఇంగ్లండ్ సిరీస్లో 700+ పరుగులు సాధించాడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.