ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. అజేయ భారత్ సూపర్-8కు దూసుకెళ్లిన తరుణంలో భారత బ్యాటర్ల ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల కంటే.. 32 ఏళ్ల స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే బౌలర్లకు అత్యంత ప్రమాదకరమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
దూబే పవర్హిట్టింగ్పై ప్రశంసలు
సునీల్ గవాస్కర్ అభిప్రాయం ప్రకారం.. శివమ్ దూబేకు ఉన్న అతిపెద్ద బలం అతని షాట్ రేంజ్. సాధారణంగా పవర్ హిట్టర్లు కొన్ని నిర్దిష్ట దిశల్లోనే బంతిని బాదుతారు.. కానీ దూబే అలా కాదని గవాస్కర్ పేర్కొన్నారు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్లోకి పంపే సామర్థ్యం అతనికి ఉందని, ముఖ్యంగా స్పిన్నర్లకు అతను సింహస్వప్నంగా మారాడని కొనియాడారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో అతను ఆడిన తీరు, అతని పరిణతికి అద్దం పడుతోందని వివరించారు.

ఆ ఒక్క షాట్ నేర్చుకుంటే ఇక అజేయుడే!
శివమ్ దూబే ఆటను మరింత ప్రమాదకరంగా మార్చేందుకు సునీల్ గవాస్కర్ ఒక విలువైన సూచన చేశారు. ప్రస్తుతం దూబే ఎక్కువగా లాంగ్-ఆన్, మిడ్-వికెట్ మీదుగా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. అయితే అతను గనుక 'ఇన్సైడ్-అవుట్' షాట్లను ఎక్స్ట్రా కవర్ మీదుగా ఆడటం అలవాటు చేసుకుంటే, అతన్ని ఆపడం ప్రపంచంలో ఏ బౌలర్కైనా అసాధ్యమని గవాస్కర్ విశ్లేషించారు. ఈ టెక్నిక్ నేర్చుకుంటే బౌలర్లు అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక తలపట్టుకుంటారని ఆయన అన్నారు.
అభిషేక్ శర్మ వైఫల్యంపై ఆందోళన
మరోవైపు ఐపీఎల్లో సెన్సేషన్ సృష్టించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్పై గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అవ్వడం అనేది ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ సిక్సర్లు కొట్టాలనే ఒత్తిడికి లోనవ్వడం వల్లే అభిషేక్ తన వికెట్ పారేసుకుంటున్నాడని.. మొదటి బంతికే బౌండరీ బాదాలనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు.
యువ ఆటగాళ్లకు గవాస్కర్ 'సక్సెస్ మంత్రం'
అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు క్రీజులో కనీసం ఒకటి రెండు ఓవర్లు గడపాలని గవాస్కర్ హితవు పలికారు. మొదట సింగిల్స్ తీసి ఖాతా తెరిస్తే, క్రీజుపై అవగాహన పెరుగుతుందని, ఆ తర్వాత సహజ సిద్ధమైన దూకుడు ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు. ప్రపంచకప్ వంటి పెద్ద వేదికలపై సంయమనం చాలా ముఖ్యమని.. అతిగా స్పందించడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని స్పష్టం చేశారు.
సూపర్-8లో భారత్ జోరు
ఇషాన్ కిషన్ పాకిస్థాన్పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ (77 పరుగులు), శివమ్ దూబే నిలకడైన ఆటతీరు భారత్కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. గవాస్కర్ సూచించిన మార్పులను దూబే పాటిస్తే, సూపర్-8 దశలో భారత బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థులకు పీడకలగా మారడం ఖాయం. ఆల్రౌండర్గా దూబే ఎదుగుదల టీమిండియా సమతుల్యతను పెంచిందని సునీల్ గవాస్కర్ ముగించారు.