సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. కాగా, ఈ సిరీస్లో కోహ్లిపైనే అందరిచూపు నెలకొంది. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లి తిరిగి లయను అందిపుచ్చుకుంటాడా లేదా అనే ఆసక్తి పెరిగింది. అంతేగాక ఈ సిరీస్లో భారత్ విజయం సాధించాలంటే కోహ్లి ఫామ్లోకి రావడం టీమిండియాకు అత్యావశక్యం.

అయితే కోహ్లి ఫామ్పై ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్, టిమ్ పైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లి ఫామ్లేమి అంగీకరించాలని పేర్కొన్నారు. కాగా, తాజాగా కోహ్లి ఫామ్ గురించి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. న్యూజిలాండ్ సిరీస్లో విఫలమవ్వడంతో విరాట్ కోహ్లి మరింత ఆకలితో ఉన్నాడని గవాస్కర్ అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటలో అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే కుప్పకూలినప్పటికీ, అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడని తెలిపాడు.
అడిలైడ్ మైదానం కోహ్లికి బాగా తెలుసని, అక్కడ నిలకడగా రాణించాడని గావస్కర్ అన్నాడు. ఇక 2018-19 పర్యటనలో పెర్త్లో కోహ్లి ఇన్నింగ్స్ ఎంతో గొప్పదని తెలిపాడు. టెస్టు కెరీర్లో కోహ్లి తన అత్యుత్తమ సెంచరీ పెర్త్లో సాధించాడని, అదో అద్భుతమైన శతకమని పేర్కొన్నాడు. గత రికార్డులతో కోహ్లికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అన్నాడు. అయితే ఆరంభంలో కోహ్లికి కాస్త అదృష్టం కూడా అవసరమని, అతను కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్లు సాధిస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో కోహ్లి 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు. ఆరు సెంచరీలు బాదాడు.