ఆల్రౌండర్ల కొరత
భారత్ జట్టులో రెండు, మూడేళ్లుగా ఆల్రౌండర్ల కొరత ఉందని సునీల్ గవాస్కర్ అన్నారు. దీంతో కెప్టెన్కు, జట్టుకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. గతంలో యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేశారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా 1983 వరల్డ్కప్ను, 2011 వరల్డ్కప్ను టీమిండియా గెలిచినప్పుడు జట్టులో అత్యుత్తమ ఆల్రౌండర్లు ఉన్నారని సునీల్ గవాస్కర్ తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత జట్టు విజయవంతంగా రాణించాలంటే సరైన ఆల్రౌండర్లు జట్టులో ఉండడం అవసరమన్నాడు.
రాహుల్ వ్యూహాలు అర్థం కాలేదు
అలాగే తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై కూడా సునీల్ గవాస్కర్ స్పందించారు. తొలి వన్డేలో రాహుల్ వ్యూహాలెంటో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. ప్రమాదకరంగా మారిన బవుమా- డస్సేన్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భువనేశ్వర్, బుమ్రా, వెంకటేశ్ అయ్యర్తో ఎక్కువ ఓవర్లు వేయించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే భారీ భాగస్వామ్యాలు నమోదవుతున్నప్పుడు ఎటువంటి కెప్టెన్కైనా ఆలోచించచడం కష్టమే అన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో రాహుల్ కెప్టెన్గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడని, అందుకే రాబోయే మ్యాచ్ల్లో విజయం సాధిస్తాడని ఆశిస్తున్నట్లు గవాస్కర్ తెలిపారు.
నేడే రెండో వన్డే
కాగా నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. పార్ల్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడి సిరీస్లో వెనుకబడ్డ టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో బరిలోకి దిగిన జట్టులో పలు మార్పులతో రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక తొలి వన్డేలో మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి పాలైన భారత్ జట్టు రెండో వన్డేలో మిడిలార్డర్ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అలాగే బౌలర్లు కూడా సత్తా చాటాలని కోరుకుంటోంది.