టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా వైఫల్యాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వీరిద్దరు ఘోరంగా విఫలమయ్యారు. ఒలివర్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్లో వరుస బంతుల్లో ఫెమిలియన్ చేరారు. పుజారా 3 పరుగులకే ఔట్ అవగా, రహానే ఖాతా కూడా తెరవకుండా ఒక్క బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుజారా, రహానే ఇద్దరికీ తమ టెస్టు క్రికెట్లో ఇంకా ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే మిగిలి ఉందని అభిప్రాయపడ్డారు. పుజారా, రహానే వరుస బంతుల్లో ఔటవడం చూస్తే సగటు క్రికెట్ అభిమాని ఎవరైనా ఇదే అనుకుంటారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జట్టులో వారి స్థానాలపై సందేహం వ్యక్తం అవుతున్న సమయంలో ఇంత దారుణంగా విఫలమవుడం విచారకరమని సన్నీ అన్నారు. ఇకపై వీరిద్దరు టీమిండియాలో కొనసాగాలంటే ఈ టెస్టు మ్యాచ్లో మిగిలిన రెండో ఇన్నింగ్స్లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందని సూచించారు. ఒక రకంగా వారికి కెరీర్లో ఇదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
కాగా చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే తమ కెరీర్లోనే అత్యంత దారుణ ఫామ్లో ఉన్నారు. ఒకప్పుడు జట్టులో దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ వారసులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు ప్రస్తుతం టీంకు భారంగా మారారు. ఇద్దరు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడి రెండేళ్లవుతోంది. ఈ క్రమంలో వారి కెరీర్ సగటు కూడా భారీగా తగ్గింది. రహానే సగటు ఏకంగా 39కి పడిపోగా, పుజారాది 44కు పడిపోయింది. టెస్టుల్లో పుజారా సెంచరీ చేయక మూడేళ్లు అవుతుంది. గతేడాది 14 టెస్టు మ్యాచ్లు ఆడిన పుజారా 34 సగటుతో 706 పరుగులు మాత్రమే చేశాడు. 6 హాఫ్ సెంచరీలు చేయగా.. ఒక్క సారి కూడా సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. గతేడాది 13 టెస్టు మ్యాచ్లు ఆడిన రహానే కేవలం 20 సగటుతో 479 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 67. ఒక్కసారి కూడా సెంచరీ చేయలేదు. శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్మాన్ గిల్ వంటి బలమైన యువ ఆటగాళ్లు బెంచ్లో ఉన్న నేపథ్యంలో కేప్టౌన్ టెస్టులో వీరిద్దరికి చోటు దొరకడం అనుమానమే.