
కృనాల్ పాండ్యా వల్లే:
రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బెయిర్స్టో, స్టోక్స్ ధాటికి అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (10 ఓవర్లలో 84), కృనాల్ పాండ్యాలు. మ్యాచ్లో 6 ఓవర్లు వేసిన కృనాల్.. ఏకంగా 72 పరుగులు సమర్పించుకున్నాడు. స్టోక్స్, బెయిర్స్టో అతని బౌలింగ్లో అలవోకగా సిక్సర్లు కొట్టడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఓవర్ ఇచ్చే సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలోనే సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కృనాల్ పాండ్యాపై అసహనం వ్యక్తం చేశాడు.
'కృనాల్ పాండ్యా జట్టులో ఐదో బౌలర్గా నాకు ఏమాత్రం కనిపించలేదు. రెండో వన్డేలో అతని కారణంగానే టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనమైంది. మ్యాచ్లో కృనాల్ తన కోటా 10 ఓవర్లని కూడా వేయలేకపోయాడు. ఒకవేళ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ లాంటి బౌలర్ టీమ్లో ఉండింటే.. కచ్చితంగా ఆ పిచ్పై కూడా అతను 10 ఓవర్లు వేసేశాడు. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి 10 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కానీ అదీ జరగలేదు' అని సన్నీ అన్నారు.

పునరాలోచిస్తే మంచిది:
'చివరి వన్డేకి నాలుగు, ఐదో బౌలర్ గురించి టీమిండియా కచ్చితంగా పునరాలోచిస్తే మంచిది. రెండో వన్డేలో బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టోని భారత స్పిన్నర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేకపోయారు. ఒకవేళ టీమ్లో రవీంద్ర జడేజా లేదా యుజ్వేంద్ర చహల్ లాంటి బౌలర్లు ఉండింటే.. ఫలితం భిన్నంగా ఉండేది' అని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మూడో వన్డేలో కృనాల్ బదులు వికెట్లు తీయడంతో పాటు పరుగులు చేసే వాషింగ్టన్ సుందర్పై కెప్టెన్ కోహ్లీ మొగ్గు చూపుతాడు.

ప్రసిద్ధ్ను టెస్టుల్లోకి తీసుకోవాలి:
యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను సుదీర్ఘ ఫార్మాట్కు పరిగణనలోకి తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. 'భీకరమైన వేగంతో ప్రసిద్ధ్ బంతులు వేస్తున్నాడు. సెలక్టర్లు అతడిని సుదీర్ఘ ఫార్మాట్కు పరిగణనలోకి తీసుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా టీ20లు, వన్డేలు ఆడుతున్నప్పుడే సెలక్టర్లు అతడిని సిద్ధం చేశారు. ఇప్పుడతను టెస్టుల్లో కీలకమైన పేసర్గా మారాడు. తన వేగం, బౌన్స్తో ప్రసిద్ధ్ సైతం మంచి టెస్టు బౌలర్ అవుతాడు' అని సన్నీ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications
