
ఢిల్లీ: ఇంగ్లండ్ను 205 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్మన్ గిల్ (0) వికెట్ కోల్పోయింది. స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే గిల్ ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయంపై గిల్ డీఆర్ఎస్ కోరినా ఫలితం దక్కలేదు. వికెట్ల ముందు దొరికిపోయిన అతడు డీఆర్ఎస్ కోరినా.. అంపైర్ కాల్ కావడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా చేటేశ్వర్ పుజారా క్రీజులో నిలబడి మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు.
శుభ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లోనూ విఫలమవ్వడంతో నిరాశకు గురయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అర్థ శతకాలతో అదరగొట్టిన గిల్.. స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఒక్క అర్ధ శతకం మినహా చెప్పుకోదగిన స్కోర్ చేయలేకపోయాడు. ఆదిలోనే వికెట్ పారేసుకుని అందరిని నిరాశపరుస్తున్నాడు. అయితే గిల్ ఇప్పుడు రాణించలేకపోవడానికి ఒక కారణముందని టీమిండియా మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత శుభ్మన్ గిల్పై భారీ అంచనాలు ఉన్నాయని సునీల్ గవాస్కర్ వివరించారు. ఈ క్రమంలోనే యువ బ్యాట్స్మన్ ఒత్తిడికి గురవుతుండొచ్చని చెప్పాడు. అలాగే గిల్ బ్యాటింగ్లో మార్పులు చేసుకోవాలని సన్నీ సూచించారు. ఇంగ్లండ్ జట్టు నాలుగో టెస్టులోనూ ప్రభావం చూపలేకపోయిందని, ఆ జట్టు బ్యాట్స్మెన్ పట్టుదల ప్రదర్శించలేకపోయారన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 250-260 స్కోర్ సాధించి ఉంటే బాగుండేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సన్నీ అన్నారు.
గురువారం ప్రారంభం అయిన నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. లారెన్స్ (46; 8 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/68), ఆర్ అశ్విన్ (3/47) మరోసారి మాయ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి గిల్ (0) వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు 181 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రోహిత్ (8), పుజారా (15) క్రీజులో ఉన్నారు.