ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి ఫోకస్ డబ్ల్యూటీసీ ఫైనల్ మీదకు మళ్లింది. టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్లు బ్యాచ్లుగా ఇంగ్లండ్ చేరుకున్నారు. అందరూ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా కూడా భారత జట్టు రన్నరప్తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈసారి కీలక ప్లేయర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్న క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచే అవకాశాలు భారత్ వద్ద మెరుగ్గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయం చెప్పాడు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్లో ఛటేశ్వర్ పుజారా చాలా కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.

ఐపీఎల్పై పెద్దగా ఇంట్రస్ట్ చూపించని పుజారా కౌంటీ క్రికెట్పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లో కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ వెటరన్ బ్యాటర్. ఈ టీం తరఫున ఆరు మ్యాచుల్లో 68.12 సగటుతో 545 పరుగులు చేశాడు. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ వంటి స్టార్లు ఉన్న జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కూడా.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన సునీల్ గవాస్కర్.. 'అక్కడ కొంత కాలంగా పుజారా ఉండటం వల్ల ఓవల్ పిచ్ ఎలా ఉంటుందో కూడా అతనికి ఒక ఐడియా ఉంటుంది. ఆ పిచ్పై ఆడి ఉండకపోవచ్చు. లండన్కు కొంత దూరంలో ఉన్న ససెక్స్లోనే ఉండి ఉండొచ్చు. కానీ ఓవల్పై ఒక కన్నేసి ఉంటాడు. కాబట్టి బ్యాటింగ్ యూనిట్కు అతను ఇచ్చే ఇన్పుట్స్ చాలా కీలకంగా ఉంటాయి. కెప్టెన్కు కూడా పుజారా ఇచ్చే సలహాలు కీలకంగా మారతాయి' అని గవాస్కర్ అన్నాడు.
'ఓవల్ పిచ్ విషయంలో పుజారా సూచనలు కెప్టెన్కు కూడా చాలా ఉపయోగపడతాయి. అతను కూడా కౌంటీల్లో కెప్టెన్సీ చేస్తున్నాడని మర్చిపోకూడదు. అతని టీంలోనే స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. కాబట్టి అతన్ని ఎలా అవుట్ చేయాలని కొన్ని స్ట్రాటజీలు వేసే ఉంటాడు' అని అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన ప్రతిసారీ పుజారా చక్కగా రాణించాడు. 2018-19, 2020-21 సీజన్లలో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్పై 24 టెస్టులు ఆడిన అతను 50.82 సగటుతో 2 వేలకు పైగా పరుగులు చేశాడు కూడా.