
చెన్నైకి గవాస్కర్ సలహా:
ఈరోజు సాయంత్రం జరగనున్న ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లోనే గెలిచి ఫైనల్లో దర్జాగా అడుగుపెట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చూస్తున్నాయి. తొలి టైటిల్ పట్టాలని ఢిల్లీ, గతేడాది పరాభవాన్ని చెరిపేసుకోవాలని చెన్నై ఆరపడుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లు వ్యూహాలను రచించాయి. ఇక ప్లేయింగ్ లెవెన్పై కూడా ఇరు జట్ల కెప్టెన్లు, కోచులు కరసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెన్నైకి ఓ సలహా ఇచ్చాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నై కీలక బ్యాటర్ సురేశ్ రైనాను తప్పకుండా ఆడించాలని సన్నీ సూచించాడు. రైనా మ్యాచ్ విన్నర్ అని, మ్యాచును మలుపుతిప్పగలదని పేర్కొన్నాడు.

రైనా మ్యాచ్ విన్నర్:
'సురేష్ రైనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా తిరిగి ప్లే ఆఫ్స్లో ఆడించాలనుకుంటుంది. రైనా ఓ మ్యాచ్ విన్నర్. వాస్తవానికి గత కొన్నేళ్లుగా రైనా ఫామ్లో లేడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కోడానికి ఇబ్బందులు పడుతున్నాడు. అయినా కూడా రైనా మ్యాచ్ పరిస్థితులను తలకిందులు చేసే సామర్థ్యం కలవాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అన్రిచ్ నోర్జ్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్ లాంటి పేసర్లు రైనాను ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అయినా చెన్నైఅతడిని తుది జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే.. రైనాను తీసుకోవడం వల్ల ధోనీసేన ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది' అని ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఐపీఎల్ 2021 కోసం ప్రస్తతం సన్నీ యూఏఈలోనే ఉన్న విషయం తెలిసిందే.

ఒకే ఒక హాఫ్ సెంచరీ:
ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. నాకౌట్ దశ ప్రారంభానికి ముందు ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా మూడు పరాజయాలను చవిచూసింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల చేతిలో ధోనీసేన ఓడిపోయింది. విజయం కోసం గత రెండు మ్యాచులో రైనాను పక్కనపెట్టి.. రాబిన్ ఉతప్పకు చోటిచ్చింది మేనేజ్మెంట్. అతడు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కీలక క్వాలిఫయర్-1లో రైనాను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో రైనా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ బాదాడు. అది కూడా మొదటి దశలో. ఢిల్లీపై 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

రైనాది చాలా కీలక పాత్ర:
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైనాది చాలా కీలక పాత్ర. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే రైనా.. మ్యాచును ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మొదటి బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా పరుగుల వరద పారిస్తాడు. 2019 వరకు రైనా 10 పరుగుల లోపు చేస్తే చెన్నై 42 శాతం మ్యాచ్లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే 68 శాతం మ్యాచ్లలో.. 50+ పరుగులు చేసినప్పుడు 63 శాతం మ్యాచ్లలో చెన్నై గెలిచింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రైనా.. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ఐపీఎల్ 2021 ఆడుతున్న రైనా.. అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికైనా రైనా పుంజుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications












