విండిస్తో సిరిస్: టీమిండియా ప్యూచర్ స్టార్స్ ఆ ముగ్గురే: సన్నీ కితాబు


హైదరాబాద్: విండిస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ పలువురు యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా రిషబ్ పంత్, పృథ్వీ షాలకు ఈ టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
అయితే, తనకు అందివచ్చిన అవకాశాన్ని యువ ఓపెనర్ పృథ్వీ షా చక్కగా వినియోగించుకోగా... రిషబ్ పంత్ కూడా ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో వీరిద్దరిపై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "ఈతరం యువ భారత క్రికెటర్లు ఆడుతున్న అద్భుత ఆట చూస్తే సంతృప్తి కలుగుతుంది" అని అన్నాడు.
"వెస్టిండీస్ జట్టులోని స్టార్ ప్లేయర్లు కొందరు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు బాగా వచ్చే టి20 లీగ్లు ఆడటానికే ఆసక్తి కనబరుస్తుండటంతో విండీస్ బాగా బలహీనంగా మారింది. గత పదేళ్లుగా ఆ జట్టు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగి చాలా ఏళ్లు అయింది. కరీబియన్ దీవులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి, కానీ అక్కడ బతుకుదెరువు కోసం ఉద్యోగావకాశాలు చాలా తక్కువ" అని గవాస్కర్ తెలిపాడు.

టి20 లీగ్లతో తమ భవిష్యత్తును భద్రం
"దీంతో టెస్టు మ్యాచ్లు ఆడటంకంటే టి20 లీగ్లతో తమ భవిష్యత్తును భద్రం చేసుకోవడంతో పాటు డబ్బులు కూడా బాగా సంపాదించుకుంటున్నారు. ఆ జట్టులో అత్యుత్తమ బౌలర్లు లేకపోవడం... అయితే ప్రమాదకరంగా ఏమీ లేని పిచ్లపై కూడా ఆ జట్టు బ్యాట్స్మన్ ఆడుతున్న తీరు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది" అని గవాస్కర్ అన్నాడు.

మూసలో ఆడటం వల్ల ఆ జట్టు ఓడిపోతోంది
"కనీసం బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చకుండా, ఒకే తరహా మూసలో ఆడటం వల్ల ఆ జట్టు ఓడిపోతోంది. నిజానికి ఛేజ్, హోల్డర్ ఇద్దరూ ప్రస్తుతం తాము ఆడుతున్న స్థానాలకంటే ఇంకా ముందుకు వస్తే బాగుండేది. మరోవైపు భారత్కు మరో సిరీస్ విజయం పూర్తిగా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా ముగ్గురు యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం జట్టుకు అదనపు బలంగా మారింది" అని గవాస్కర్ తెలిపాడు.

పరుగులు సాధించాలనే తపన పృథ్వీ షాలో
"పరుగులు సాధించాలనే తపన పృథ్వీ షాలో కనిపించగా... అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్లో రిషభ్ పంత్ ఎంతో చక్కగా ఆకట్టుకున్నాడు. ఇక, కుల్దీప్ యాదవ్ కూడా తొలిసారి ఐదు వికెట్ల ఘనతను ఈ సిరిస్లో నమోదు చేశాడు. ఈ సిరిస్లో ఈ ముగ్గురిని భారత భవిష్యత్తుగా చెప్పవచ్చు. చాలా మందిలాగే కెరీర్లో మున్ముందు ఎత్తుపల్లాలు వచ్చే అవకాశం ఉన్నా వీరు మాత్రం సాధించగలరు, వికెట్లు పడగొట్టగలరు" అని గవాస్కర్ అన్నాడు.

ఉమేశ్ యాదవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి
"ఈ సిరిస్ ద్వారా టెస్టులో పది వికెట్లు సాధించిన ఉమేశ్ యాదవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. కుడిచేతి వాటం బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని అతను అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేస్తూ ప్యాడ్, బ్యాట్ మధ్యలోంచి దూసుకుపోయేలా చేశాడు. కొత్త బంతిని అద్భుతంగా ఉపయోగించగల బౌలింగ్ దళం ఇప్పుడు భారత్ సొంతం. టెస్టు సిరీస్లో అలవోకగా నెగ్గడంతో ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్పై ఉంది" అని అన్నాడు.

21న గువహటి వేదికగా తొలి వన్డే
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా అక్టోబర్ 21న గువహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరిస్ నవంబర్ 1వ తేదీన తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో జరిగే ఆఖరి వన్డేతో ముగియనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా రెండోస్థానంలో కొనసాగుతుండగా.. పర్యాటక వెస్టిండిస్ జట్టు తొమ్మిదోస్థానంలో ఉంది.

తొలి వన్డే: అక్టోబర్ 21న గువహతి బసపర క్రికెట్ స్టేడియం
రెండో వన్డే: అక్టోబర్ 24న విశాఖపట్నం ఏసీఏ,వీడిసిఏ క్రికెట్ స్టేడియం
మూడో వన్డే: అక్టోబర్ 27న పూణే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
నాలుగో వన్డే: అక్టోబర్ 29న ముంబై బ్రబౌర్న్ స్టేడియం
ఐదో వన్డే: నవంబర్ 1న తిరువనంతపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications