బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటైనప్పటికీ, కాస్త గౌరవప్రదంగా టీమిండియా పరాజయాన్ని చవిచూసిదంటే సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ గొప్ప పోరాటమే. పంత్ తన శైలిలో విరుచుకుపడి సెకండ్ ఇన్నింగ్స్లో 99 పరుగులు చేశాడు.
మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో డకౌటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్లో 150 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే సర్ఫరాజ్కు తుదిజట్టులో అంత సులువగా చోటు దక్కలేదు. తొలి టెస్టు ఆరంభానికి ముందు శుభ్మన్ గిల్కు మెడనొప్పి రావడంతో సర్ఫరాజ్కు చోటు దక్కింది. దక్కిన అవకాశాన్ని ఈ మిడిలార్డర్ బ్యాటర్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.

అయితే దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్కు గతంలోనే అవకాశాలు రావాలని, కానీ శరీరాకృతి కారణంగా అతన్ని పక్కనపెట్టారని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అతని నడుము నాజుగ్గా లేదని, అంతర్జాతీయ క్రికెట్కు స్లిమ్గా ఉండాలనే ఉద్దేశంతో అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు. అయితే ఇప్పుడు అదే సర్ఫరాజ్..అతని నడుము కంటే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని గవాస్కర్ తెలిపాడు. భారత క్రికెట్లో నిర్ణయాధికారులు ఎక్కువగా ఉండటం బాధాకరమని అన్నాడు.
రిషభ్ పంత్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. ''ఇక ఫిట్నెస్ అతివాదులు కోరుకున్నట్లుగా లేని మరో క్రికెటర్.. రిషభ్ పంత్. పంత్ గొప్ప ఇంపాక్ట్ ప్లేయర్. వాళ్లు ఆశించినట్లుగా పంత్కు శరీరాకృతి లేనప్పటికీ.. అతను రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఆరు గంటలకుపైగా ఆట కోసం వంగిలేస్తున్నాడు. అంతేగాక త్రోలను అందుకోవడం కోసం స్టంప్స్ దగ్గరకు పరిగెత్తుతున్నాడు''

''కాబట్టి యోయో పరీక్షలకు బదులుగా మానసికంగా సన్నద్ధంగా ఉంటున్నారా లేదా అని ఆటగాళ్లను పరీక్షించండి. అదే ప్లేయర్ ఫిట్నెస్ పరీక్ష. ఓ ప్లేయర్ రోజంతా బ్యాటింగ్ చేయగలడా? రోజుకు 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడా? అనే దాని గురించి ఆలోచించండి. అంతేకానీ, అతను స్లిమ్ ఉన్నాడా? నాజుగ్గా నడుము ఉందా అని అలోచింకండి'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.