ఐపీఎల్-2024లో ఫైనల్స్కు దూసుకెళ్లాలనుకున్న రాజస్థాన్ రాయల్స్కు నిరాశే మిగిలింది. చెపాక్ వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయిర్-2లో 36 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కీలక మ్యాచ్లో తడబడి టైటిల్కు దూరమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది.
హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో, 5x4, 2x6), ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/27), ట్రెంట్ బౌల్ట్ (3/45) చెరో మూడు, సందీప్ శర్మ (2/25) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.

ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6), యశస్వీ జైస్వాల్ (42; 21 బంతుల్లో, 4x4, 3x6) పోరాడారు. మందకొడి పిచ్పై సన్రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ (3/23) మూడు, అభిషేక్ శర్మ (3/24) రెండు వికెట్లతో రాజస్థాన్ను చిత్తుచేశారు. నటరాజన్ (1/13), కమిన్స్ (1/30) చెరో వికెట్ తీశారు. అయితే ఛేదనలో ఓ దశలో రాజస్థాన్ మెరుగైన స్థితిలోనే ఉంది. జైస్వాల్ దూకుడుగా ఆడటంతో ఆర్ఆర్ పవర్ప్లేలో 51 పరుగులు చేసింది.
కానీ షాబాజ్ అహ్మద్ బంతిని అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కుదురుకున్న జైస్వాల్, కీలక బ్యాటర్ రియాన్ పరాగ్ (6; 10 బంతుల్లో), అశ్విన్ (డకౌట్)ను షాబాజ్ పెవిలియన్కు చేర్చాడు. అయితే వికెట్లు పడటంతో రియాన్ పరాగ్ జాగ్రత్తగా ఆడాడు. బౌండరీకి కూడా యత్నించకుండా వికెట్లను అడ్డుకున్నాడు. కానీ 11వ ఓవర్లో తొలి బంతికి షాట్కు యత్నించి డీప్ మిడ్ వికెట్లో ఉన్న అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు.
టెంపర్మెంట్ లేమితో పరాగ్ ఆడిన షాట్పై రాజస్థాన్ డగౌట్లో ఉన్న సంగక్కర షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గవాస్కర్ పరాగ్ను తీవ్రంగా విమర్శించాడు. సీరియస్లీ? అని ఏకంగా మూడు సార్లు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆలోచించకుండా షాట్లు ఆడితే, ఎంత టాలెంట్ ఉన్నా ఏం ఉపయోగమని భారత కుర్రాడు పరాగ్పై గవాస్కర్ మండిపడ్డాడు.
''సీరియస్లీ? సీరియస్లీ? ఆలోచించకుండా షాట్లు ఆడాలనుకుంటే ఎంత టాలెంట్ ఉన్నా ఏం ఉపయోగం? అదేం షాట్ అసలు? సీరియస్లీ! ఎంతో నైపుణ్యం ఉండి, టెంపర్మెంట్ లేకపోతే ఏం ఫలితం ఉండదు. కుదురుకోవడానికి కొన్ని డాట్స్ బాల్స్ తీసుకోవడం వల్ల ఏం ఒరిగింది? దానికి తగ్గట్లుగా ఆడాలి కదా'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.