మరో నెల రోజుల్లో టీమిండియా టెస్టు ఫార్మాట్ సందడి మొదలుకానుంది. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్గానే బరిలోకి దిగుతోంది. 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే 1992 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాతో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలోప్రాక్టీస్ మ్యాచ్ను రెండు రోజులకు కుదించారు.

దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిన్సర్ట్స్ XIతో జరగాల్సిన మ్యాచ్ రెండు రోజులకు కుదించారని వార్త తెలిసి నిరాశకు గురయ్యానని తెలిపాడు. దీని వల్ల యువ ఆటగాళ్లకు కీలక సాధన మిస్ అవుతుందని అన్నాడు. మరోవైపు ఈ కారణంతో సీనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్కు వెళ్లని పరిస్థితి కూడా ఉంటుందని పేర్కొన్నాడు.
అయితే రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ద్వారా యువ ఆటగాళ్లు ఎక్కువ అనుభవం పొందుతారని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటన ముఖ్య ఉద్దేశం క్రికెట్ ఆడటమని, విశ్రాంతి తీసుకోవడం కాదని గవాస్కర్ అన్నాడు. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్ను మూడు రోజులకు పెంచాలని, యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని, దీని కోసం బీసీసీఐ చర్యలు తీసుకోవాలని గవాస్కర్ సూచించాడు.
''ఆస్ట్రేలియా ప్రతీకారం దాహంతో ఉంది. కంగారూల గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ విజయాలు సాధించాలంటే భారత్ అప్రమత్తంగా ఉండాలి. అయితే వార్మప్ మ్యాచ్ను మూడు రోజులకు మార్చడానికి ఇంకా సమయం ఉంది. ఈ సాధనలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించడానికి యువ ప్లేయర్లకు ఇది సాయపడుతుంది. కమాన్ బీసీసీఐ. ఇది మీరు చేయగలరు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.