ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ పరుగుల వరద పారించాడు. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 89 సగటుతో 712 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలుకొట్టాడు. రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. అంతేగాక మూడు హాఫ్ సెంచరీలు బాదాడు.
యశస్వీ జైస్వాల్ ఫామ్ దెబ్బకు ఐసీసీ అవార్డు కూడా లభించింది. ఫిబ్రవరి నెల ఐసీసీ మేటి ఆటగాడి అవార్డును యశస్వీ గెలుచుకున్నాడు. ఈ అవార్డు రేసుకు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ప్లేయర్ పతుమ్ నిశాంక కూడా పోటీపడ్డారు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో 22 ఏళ్ల జైస్వాల్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చానని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు.

నిర్లక్ష్యంగా వికెట్ చేజార్చుకోవద్దని యశస్వీ జైస్వాల్ను సున్నితంగా మందలించానని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే జైస్వాల్ వయస్సులో ఎవరైనా లెక్కలేనితనంగానే ఉంటారని, అర్థం చేసుకోగలనని తెలిపాడు.''యశస్వీ జైస్వాల్ పరుగుల వరద పారించడం, ఎటాకింగ్ క్రికెట్ ఆడటాన్ని చూడటం ఎంతో ఆనందంగా ఉంది. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు మొదటి రోజు.. హోటల్ లిఫ్ట్లో యశస్వీని సున్నితంగా మందలించాను. అంతకుముందు ట్రిడాండ్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో అతడు వికెట్ చేజార్చుకోవడం గురించి చర్చించి హెచ్చరించాను''
''అర్ధశతకం సాధించిన తర్వాత బౌలర్లకు వికెట్ను సులువుగా ఇవ్వకూడదని యశస్వీతో చెప్పాను. అతను నా మాట విన్నాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు బాదాడు'' అని గవాస్కర్ అన్నాడు. వైజాగ్ టెస్టులో 209 పరుగులు బాదిన యశస్వీ రాజ్కోట్ టెస్టులో 214 పరుగులు చేశాడు. కానీ మిగిలిన టెస్టుల్లో 80, 73, 57తో అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.
దీనిపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ''అతడు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ సమయంలో నేను చెప్పిన మాట అతడు మరిచిపోయాడనుకుంటా. అయినా 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లు ఎవరి మాట పట్టించుకోరు. నేను కూడా అలానే చేసి ఉంటా. అయితే యశస్వీ మరిన్ని ఘనతలు సాధించాలనుకుంటున్నా. అలాగే భారత క్రికెట్ వల్లే అతను ఈ స్థానంలో ఉన్నట్లు యశస్వీ ఎప్పటికీ మరిచిపోడని భావిస్తున్నా'' అని గవాస్కర్ తెలిపాడు.