అన్యాయంగా ఐపీఎల్ రూల్స్: మార్చాలని సన్నీ ఆగ్రహం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూల్స్ అన్యాయంగా ఉన్నాయని వాటిని వెంటనే మార్చాలని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో డకవర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సన్రైజర్స్పై కోల్కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ మ్యాచ్లు జరిగే సమయంలో వర్షం పడితే రూపొందించిన నియమాలు ఎంత మాక్రం సక్రమంగా లేవని సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రేక్షకులను రాత్రి 1.20 గంటల వరకు వేచి ఉండమని చెప్పడం అటు బీసీసీఐకి గానీ ఇటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి గానీ మంచిది కాదని చెప్పాడు.
సోనీ మ్యాక్స్ టీవికి ఇచ్చిన 'ఎక్స్స్ట్రా ఇన్నింగ్స్' కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. అంతేకాదు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంటే సాయంత్రం 5 గంటలకే ఆటగాళ్లను మైదానాన్ని రమ్మని చెప్పడం ఎంతమాత్రం సరికాదని అన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ పదేళ్లు పూర్తి చేసుకుందని, కనీసం రాబోయే ఐదేళ్ల సీజన్లోనైనా వర్షం ప్రభావితం చేసే మ్యాచ్ల్లో కొత్త నియమాలను ప్రవేశపెట్టాని ఐపీఎల్ నిర్వాహకులకు సూచించాడు.
ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు, ప్రేక్షకుల అభిప్రాయాలను సైతం తీసుకోవాలని సూచించాడు. ఐపీఎల్ పదో సీజన్లో టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సన్రైజర్స్.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో 128 పరుగులకే పరిమితమైంది. అనంతరం కోల్కతా నైట్రైడర్స్ జట్టును ఛేజింగ్ ప్రారంభించనీయకుండా వరుణుడు అడ్డుపడ్డాడు.

వర్షం పడిన సమయంలో
ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఐపీఎల్ నిర్వహకులు పలు నియమాలను సూచించారు. అవేంటంటే
* 11:50 లోపు వరుణుడు కరుణించి మైదానం సిద్ధంగా ఉంటే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు.
* 12:58 వరకు మ్యాచ్ నిర్వహించడానికి వీలుంటే 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అప్పుడు కోల్కతా లక్ష్యం 41 పరుగులుగా నిర్ణయించారు.
* ఒకవేళ 1:20 వరకు పరిస్థితులు అనుకూలిస్తే సూపర్ ఓవర్ నిర్వహించి విజేతను తేలుస్తారు.
* మ్యాచ్ రద్దైయితే సన్రైజర్స్ విజేతగా నిలువనుంది.

ఎలిమినేటర్ మ్యాచ్కి ఎలాంటి రిజర్వ్ డే లేదు
ఐపీఎల్ పదో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్కి ఎలాంటి రిజర్వ్ డే లేదు. కాబట్టి.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్వర్త్ ప్రకారం కోల్కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. రాత్రి 12:55 గంటలకు ఆట మొదలైంది. లక్ష్య ఛేదనలో క్రిస్ లిన్ (6), రాబిన్ ఊతప్ప(1), యూసుఫ్ పఠాన్(0) త్వరగానే అవుటైనా.. కెప్టెన్ గంభీర్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ విజయంతో గతేడాది ఎలిమినేటర్లో రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి కోల్కతా ప్రతీకారం తీర్చుకుంది.

క్వాలిఫయర్-2లో ముంబైతో తలపడనున్న కోల్కతా
శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ముంబైతో కోల్కతా తలపడనుంది. కోల్ కతా విజయ లక్ష్యం 36 బంతుల్లో 48. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్కతాకు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే, టోర్నీలో అత్యంత నాణ్యమైన బౌలింగ్ని కలిగి ఉన్న హైదరాబాద్ వైపు కూడా విజయావకాశాలు కనిపించాయి. దీనికి తోడు వర్షం కారణంగా పిచ్ తేమగా ఉంది. ఈ క్రమంలో వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది. ఇన్నింగ్స్ రెండో బంతినే సిక్సర్గా మలిచిన కోల్కతా ఓపెనర్ క్రిస్ లిన్ (6)ను ఆ తర్వాతి బంతికే భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. ఆ మరుసటి బంతికి యూసుఫ్ పఠాన్ (0) రనౌటయ్యాడు.

వర్షం అనంతరం మ్యాచ్ని ఏకపక్షం చేసిన గంభీర్
ఇక, సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన క్రిస్ జోర్డాన్ తన తొలి బంతికే రాబిన్ ఊతప్ప (1)ను పెవిలియన్ చేర్చడంతో నైట్ రైడర్స్ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో హైదరాబాద్ అద్భుతం చేసేలా కనిపించింది. కానీ, అదే ఓవర్ ఐదో బంతికి కెప్టెన గంభీర్ సిక్సర్ రాబట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆరు పరుగులే ఇవ్వడంతో కోల్ కతా విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ, కౌల్ బౌలింగ్లో వరుసగా 4, 6 బాదిన గంభీర్ మ్యాచ్ని ఏకపక్షం చేసేశాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే కోల్కతా లక్ష్యాన్ని చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications