
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాలకు బ్రేక్ పడట్లేదు. వరుసగా మూడు మ్యాచ్లల్లో దారుణంగా ఓడిపోయింది. టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఈ టీమ్ హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. ఛాంపియన్ రేంజ్లో ఆడట్లేదు. తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడిపోయింది. వరుస ఓటముల దెబ్బకు ఆటోమేటిక్గా విమర్శల జడివాన కురుస్తోందా జట్టు మీద.
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడానికి ఎంఎస్ ధోనీ ప్రధాన కారకుడంటూ టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తాజాగా విమర్శలు సంధించారు. దూకుడుగా ఆడుతున్న శివం దుబేను ఎదురుగా పెట్టుకుని స్ట్రైక్ను రొటేట్ చేయలేకపోయాడని విమర్శించారు. శివం దుబేకు ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదని వ్యాఖ్యానించాడు. స్ట్రైక్ను రొటేట్ చేస్తూ- దుబేను ప్రోత్సహించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.
28 బంతుల్లో ధోనీ 23 పరుగులు మాత్రమే చేశాడని, ఒక దశలో 10 పరుగులు చేయడానికి 20 బంతులను తీసుకున్నాడని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో శివం దుబేను ఆడటానికి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని సునీల్ గవాస్కర్ అన్నారు. శివం దుబే 30 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 57 పరుగులు చేశాడని, అలాంటి బ్యాటర్కు మరింత ఎక్కువసేపు స్ట్రైక్ చేసే ఛాన్స్ ఇవ్వడంలో ధోనీ విఫలం అయ్యాడని విశ్లేషించారు.

తాను భారీ షాట్లను ఆడలేనప్పుడు.. దూకుడు మీదున్న తోటి బ్యాటర్ను స్ట్రైక్ను ఇవ్వడం అనేది ప్రాథమిక సూత్రమని, ధోనీ దీన్ని అనుసరించలేదని సునీల్ గవాస్కర్ అన్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో ధోనీ సింగిల్స్, డబుల్స్ వద్దే స్తంభించిపోయాడని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. దురదృష్టవశావత్తు దుబేకు సపోర్ట్ లేకుండా పోయిందని చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన రవీంద్ర జడేజా తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడని సునీల్ గవాస్కర్ చెప్పారు. దీని నుంచి అతను ఎంత త్వరగా బయటికి వస్తే- జట్టుకు అంత మేలు కలుగుతుందని అన్నారు. ఓ జట్టు వరుసగా మూడు మ్యాచ్లను ఓడిపోవడం అనేది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. చెన్నై వంటి టీమ్ వరుసగా మూడు మ్యాచ్లల్లో ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఆ జట్టు మళ్లీ రేసులోకి వస్తుందని నమ్ముతున్నట్లు సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.