30 ఏళ్లు పైబడిన క్రికెటర్లో లోపాలు వెతకడం చాలా సులభం
'30 ఏళ్లు పైబడిన క్రికెటర్లో లోపాలు వెతకడం చాలా సులభం. ధోని విషయంలోనూ అదే జరుగుతోంది. లక్ష్మణ్, అగార్కర్లు భారత మాజీ క్రికెటర్లు. ధోని తప్పుకోవాలంటూ వారు సూచించారు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదు' అని సన్నీ అన్నాడు.
రెండో టీ20 ఓటమికి యువ ఆటగాళ్లు బాధ్యత వహించాలి
'కెప్టెన్, కోచ్, సెలక్టర్లు జట్టు ఆటగాళ్లపై నిర్ణయం తీసుకుంటారు. ధోని ఏం చేస్తాడో, అతడి ప్లానింగ్ ఏంటో తెలుసుకునేందుకు కొంతకాలం వరకు ఎదురుచూద్దాం. 37 బంతుల్లో ధోని 49 పరుగులు చేశారని విమర్శిస్తున్నారు' అని గవాస్కర్ పేర్కొన్నాడు. నిజానికి రెండో టీ20లో ఓటమికి జట్టులోని యువ ఆటగాళ్లు బాధ్యత వహించాలని గవాస్కర్ తెలిపాడు.
సాధారణ గూగ్లీకి అవుటైన పాండ్యా
'రెండు టీ20ల్లో కలిసి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సాధారణ గూగ్లీకి పాండ్యా అవుటైనా అతడిపై దృష్టి సారించడం లేదు. ఓపెనర్లు ఇద్దరు సరైన ఆరంభాలను ఇవ్వలేదు. ఇలాంటి విషయాలను మనం పట్టించుకోం.. కేవలం ధోని వైపు మాత్రమే వేలెత్తి చూపిస్తాం. ఇది దురదృష్టకరం' అని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ధోనిపై అగార్కర్ ఇలా
‘వన్డేల్లో ధోని అనుభవం, ఆట జట్టుకు ఉపయోగపడొచ్చు.. కానీ అతడు కెప్టెనా.. లేక కేవలం ఆటగాడా అన్నది మనం ఆలోచించాలి. వన్డే వరకు ధోనిని మనం తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ టీ20ల్లో మాత్రం ధోని సాధ్యమైనంత త్వరగా ఇతరులకు అవకాశమిస్తూ తప్పుకోవడం ఉత్తమం' అని అగాస్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.