
హైదరాబాద్: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. అంతేకాదు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై 164 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఓవర్ నైట్ స్కోరు 104 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన అలెస్టర్ కుక్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. కెప్టెన్ జో రూట్తో కలిసి మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ కుక్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఒంటరి పోరాటం చేశాడు.
దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి అలెస్టర్ కుక్ (244 నాటౌట్), ఆండర్సన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో కుక్ డబుల్ సెంచరీ సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్కు చెందిన బ్రియాన్ లారా, చందర్ పాల్, శ్రీలంకకు చెందిన మహిళా జయవర్దనేను వెనక్కి నెట్టాడు.
ప్రస్తుతం 11,956 పరుగులతో కుక్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్టు ఆటగాడిగా అలెస్టర్ కుక్ అరుదైన రికార్డు సృష్టించాడు. 1984లో వివ్ రిచర్డ్స్ ఈ మైదానంలో 208 పరుగులు చేశాడు. ఆ రికార్డుని అలెస్టర్ కుక్ గురువారం అధిగమించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.