హైదరాబాద్: వెస్టిండిస్ హెడ్ కోచ్ పదవికి స్టువర్ట్ లా రాజీనామా చేశాడు. వచ్చే కౌంటీ సీజన్లో అతడు మిడెలెక్స్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో అతడు ఆ జట్టుతో కోచింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు గాను నాలుగేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు.
దీంతో ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ నెలల్లో జరిగే భారత్, బంగ్లాదేశ్ పర్యటనలే అతనికి చివరివి కానున్నాయి. ఈ సందర్భంగా స్టువర్ట్ లా మాట్లాడుతూ "మిడిలెక్స్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. వెస్టిండిస్ జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్తో ఎంజాయ్ చేశాను" అని చెప్పుకొచ్చారు.
"వెస్టిండిస్ జట్టుని వదిలివెళ్లడానికి ఇది సరైన సమయం కాదు, అయితే మిడిలెక్స్ జట్టుతో కుదిరిన నాలుగు ఏళ్ల ఒప్పందమే నన్ను ఆ దిశగా నడిచేలా చేసింది. గడచిన రెండేళ్లలో జట్టుగా ఎన్నో అద్భుతాలు సాధించామని అనుకుంటున్నా" అని స్టువర్ట్ లా పేర్కొన్నారు.
2017 నుంచి స్టువర్ట్ లా వెస్టిండిస్ కోచ్గా పని చేస్తున్నారు. త్వరలో వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, ఐదు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఆస్ట్రేలియాకు చెందిన స్టువర్ట్ లా 1995-99 మధ్య ఒక టెస్ట్, 54 వన్డే మ్యాచ్లు ఆడాడు.