
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఇండియా లెజెండ్స్ శుభారంభం చేసింది. సౌతాఫ్రికా లెజెండ్స్పై ఘన విజయం సాధించింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ - 2022 సీజన్ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ సీజన్ ఘనంగా ముగించుకున్న ఈ టోర్నీ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఈ సిరీస్ రెండో సీజన్లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ లెజెండ్స్తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు బరిలోకి దిగాయి.
ఈ సీజన్ తొలి మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరిగింది. ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడ్డాయి. ఇక ఇండియా లెజెండ్స్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ (82పరుగులు 42బంతుల్లో 5ఫోర్లు 6సిక్సర్లు నాటౌట్) చెలరేగి ఆడాడు. దీంతో ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 217పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 156పరుగులకే పరిమితమైంది.
దీంతో ఇండియా 61పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బిన్నీ నిలిచాడు. భారత బ్యాటర్లలో నమాన్ ఓజా (21), సచిన్ (16), సురేష్ రైనా (33), యువరాజ్ సింగ్ (6), యూసుఫ్ పఠాన్ (35పరుగులు 15బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు) పర్వాలేదనిపించారు. బౌలర్లలో రాహుల్ శర్మ 3, మునాఫ్ పటేల్, ఓజా తలా 2, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ తలా 1 వికెట్ తీశారు.
ఇకపోతే ఈ టోర్నీ విషయానికొస్తే.. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1వరకు రెండో సీజన్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లు కాన్పూర్, రాయ్పూర్, ఇండోర్తో పాటు డెహ్రాడూన్ వేదికగా జరగనున్నాయి. రాయ్పూర్ వేదికగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా సెప్టెంబర్ 16నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లన్నీ కలర్స్ సినీప్లెక్స్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వూట్ యాప్, వెబ్సైట్లో కూడా మ్యాచ్లను చూడవచ్చు. ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా మ్యాచ్లను చూడవచ్చు.