
హైదరాబాద్: క్రికెట్లో ఇప్పుడు ఎక్కడైనా బాల్ ట్యాంపరింగ్ టాపిక్కే. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన దుశ్చర్య తీవ్ర సంచలనం సృష్టించడంతో ఆటగాళ్ల ప్రవర్తన, క్రీడాస్ఫూర్తితో పాటు తమ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్)ని సమీక్షించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. ఇక నుంచి నియమావళిని అతిక్రమించే ఆటగాళ్లకు కఠిన చర్యలకు తీసుకునేలా ప్రణాళిక రూపొందించనుంది.
ఈ విషయమై ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలో సవరణలు చేపడతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బాల్ ట్యాంపరింగ్, శ్రుతిమించిన స్లెడ్జింగ్లాంటి వ్యవహారాలను సీరియస్గా తీసుకుంటామని, కఠిన చర్యలకు ఊతమిచ్చేలా నియమావళిని మారుస్తామని ఆయన చెప్పారు.
'ఇటీవలి కాలంలో క్రికెట్ పరువు తీసే సంఘటనలు చాలా జరిగాయి. స్లెడ్జింగ్, అవుటైన ఆటగాళ్లను అవమానించడం, అంపైర్ నిర్ణయాలను వ్యతిరేకించడం, మైదానం నుంచి వెళ్లిపోవడంతో పాటు ఆసీస్ బాల్ టాంపరింగ్ పరాకాష్టగా నిలిచింది. ఇక జరిగింది చాలు.. ఇక ముందు నుంచి మేం కఠినంగా ఉండాలనుకుంటున్నాం. ఇందుకోసం ప్రస్తుత నియమావళిని సవరిస్తాం. దిగ్గజ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లతో కూడిన కమిటీని నియమిస్తాం. వారు ఇప్పుడున్న కోడ్కు ఎలాంటి సవరణలు చేయాలో సూచిస్తారు. శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ' అని రిచర్డ్సన్ అన్నారు.
బాల్ టాంపరింగ్కు పాల్పడిన బాన్క్రాఫ్ట్, స్మిత్లపై ఐసీసీ వేసిన స్వల్ప శిక్షలను ఆయన సమర్థించుకున్నారు. తాము కేవలం నిబంధనలకు లోబడి లెవెల్-2 అతిక్రమణ కింద మాత్రమే స్పందించామని గుర్తుచేశారు. ఒకవేళ శిక్షల విషయంలో ఫుట్బాల్లో ఉన్నట్లు ఎల్లో, రెడ్ కార్డులను క్రికెట్లోనూ ప్రవేశపెడితే వచ్చే ప్రయోజనమేమీ తనకు కనబడటం లేదన్నారు. 'ఇదివరకే దీనిపై ఐసీసీ చర్చించింది కూడా! మళ్లీ మరోసారి చర్చించాల్సిన అవసరముంది. అయితే ఈ కార్డులతో పరిస్థితిలో మార్పుంటుందని నేననుకోవడం లేదు' అని రిచర్డ్సన్ తెలిపారు.