క్రికెట్లో వినూత్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వికెట్లకు బాల్ తాకినా బెయిల్స్ పడకపోవడం గతంలో ఎన్నో సార్లు చూశాం. బ్యాటర్కు అదృష్టం వరించిందని ఫీల్డింగ్ జట్టు అసంతృప్తి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ముంబయిలో జరిగిన ఓ లోకల్ టోర్నీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.
బౌలర్ విసిరిన వేగంవంతమైన బంతి వికెట్ల మధ్యలో నుంచి దూసుకెళ్లింది. ఆ వేగానికి వికెట్లు ఎగిరిపడాల్సింది. కానీ వికెట్ ఎగరలేదు, కనీసం బెయిల్ కూడా పడలేదు. దీంతో ఫీల్డింగ్ జట్టు ఒక్కసారిగా షాకైంది. ఔట్ అని ఫీల్డింగ్ టీమ్ అపీల్ చేసినా బెయిల్ పడకపోవడంతో అంపైర్ నాటౌట్గానే ప్రకటించాడు. ఆఫ్ స్టంప్, లెగ్ స్టంప్ మధ్య దూరం 22.2 సెంటీమీటర్లు ( 9 అంగుళాలు) ఉండాలి. కానీ స్టంప్స్ను కాస్త దూరంగా అమర్చినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే తరహా సంఘటన ఒకసారి చోటు చేసుకుంది. 1997-98లో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్కు దురదృష్టం వెంటాడింది. పాక్ బౌలర్ ముస్తాక్ అహ్మద్ వేసిన బాల్ స్టంప్స్ మధ్యలో నుంచి వెళ్లించి. కానీ బెయిల్స్ కూడా చెక్కచెదర్లేదు. అంపైర్ కూడా ఆశ్చర్యపోయాడు. స్పష్టత కోసం రిప్లేలో కూడా పరిశీలించారు. ఆ తర్వాత స్టంప్స్ను మరోసారి సరిచేశారు.అయితే ఆ సమయంలో కామెంటరీలో ఉన్న వ్యాఖ్యతలు ఇలాంటి ఘటనను గతంలో ఎప్పుడూ చూచలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ముంబయి లోకల్ టోర్నీకి సంబంధించిన అరుదైన సంఘటన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. బ్యాటర్కు విపరీతమైన అదృష్టం, బౌలర్కు రెట్టింపు దురదృష్టం ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.