హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై విధించిన ఏడాది పాటు నిషేధం శుక్రవారంతో ముగిసింది. ఇకపై స్మిత్, వార్నర్లు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. గతేడాది కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో బాల్ టాంపరింగ్కు పాల్పడటంతో వీరిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వాళ్లిద్దరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించారని... శుక్రవారంతో వారిపై విధించిన నిషేధం ముగియడంతో ఇకపై వారిద్దరూ స్వేచ్ఛగా అంతర్జాతీయ మ్యాచ్లో పాల్గొనవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే నిషేధం ముగిసిన రోజే ఈ ఇద్దరు క్రికెటర్లు హైదరాబాద్లో ఉండటం విశేషం. ఐపీఎల్లో భాగంగా శుక్రవారం సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డ అయిన ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ప్రత్యర్ధులుగా తలపడుతుండటంతో ఈ మ్యాచ్కి ప్రత్యేకత సంతరించుకుంది. అయితే వీరి రాకతో అటు ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత వార్నర్పై జట్టులోని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వార్నర్ రాకను మిచెల్ స్టార్క్, హజల్వుడ్, నాథన్ లయన్, ప్యాట్ కమిన్స్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక కథనంలో పేర్కొంది. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదని, ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న విభేదాలు సహజమేనని రాబర్ట్స్ అన్నారు. ఇక, ఈ ఇద్దరి రాకతో అటు ఆస్ట్రేలియా సెలక్టర్లకు కూడా కొత్త తలనొప్పులు వచ్చాయి.
ఇటీవలే ఆస్ట్రేలియా వన్డే జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. భారత్తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్ను 3-2తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా... ఆ తర్వాత పాకిస్థాన్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ను సైతం మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. జట్టులోని ఆటగాళ్లు అందరూ ఫామ్లో ఉన్న సమయంలో ఈ ఇద్దరిని వరల్డ్కప్కు ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాల్గా మారింది.