ఆసియా కప్లో జరగనున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్పై శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆ మ్యాచ్పై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవైపు పాకిస్థాన్ మనల్ని నిరంతరం బెదిరిస్తుంటే.. మరోవైపు మనం వారితో క్రికెట్ ఆడటానికి సిద్ధమవుతున్నామని ఆమె ప్రశ్నించారు. "ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? ఇకపై పాకిస్థాన్తో ఎటువంటి మ్యాచ్లు ఉండవని మనం చెప్పలేమా?" అని ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నలు గుప్పించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన.."పాకిస్థాన్ మునిగితే సగం ప్రపంచాన్ని కూడా ముంచేస్తుంది" అనే ప్రకటనను ఆమె ఒక డొల్ల బెదిరింపుగా అభివర్ణించారు. "ఇది కేవలం భయపెట్టే ప్రయత్నం మాత్రమే. దీనిలో ఎటువంటి నిజం లేదు. పాకిస్తాన్కు ఎలా సమాధానం చెప్పాలో మన వైమానిక దళం ఇప్పటికే చూపించింది. ఆపరేషన్ సిందూర్ దీనికి గొప్ప ఉదాహరణ" అని ఆమె అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నుంచి భారత్కు అణుయుద్ధం గురించి బెదిరిస్తున్నప్పుడు, మనం వారితో క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది దేశ ప్రజలకు అన్యాయం అన్నారు. పాకిస్తాన్తో మన విధానం స్పష్టంగా ఉండాలని, అన్ని రకాల సంబంధాలపై పునరాలోచించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘంపై ఆరోపణలు
ఎన్నికల సంఘం ఇండియా కూటమి నాయకులను సమావేశానికి పిలవడంపై ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ఇది బలవంతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. ప్రజల ఓటింగ్ హక్కుల కోసం ప్రతిపక్షం నిరంతరం పోరాడుతున్నప్పటికీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవని ప్రియాంక చతుర్వేది అన్నారు. రాహుల్ మీడియాలో వాస్తవాలను ఎన్నికల సంఘానికి ఆధారాలను సమర్పించినప్పటికీ ఇప్పుడు ఆయనను అఫిడవిట్ కోరడం ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుందని ఆమె అన్నారు.
ఆరోగ్య బీమాపై జీఎస్టీ రద్దుకు డిమాండ్
ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనను ఆమె స్వాగతించారు. ప్రభుత్వం ఆరోగ్య బీమాపై జీఎస్టీని తొలగించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆమె కోరారు. విద్య, ఆరోగ్యం ఏ దేశానికైనా పునాది అని, వాటిపై ప్రభుత్వం సీరియస్గా పనిచేయాలని ఆమె అన్నారు.
పాకిస్తాన్తో క్రీడలు ఆడాలా?
చివరగా, పాకిస్తాన్ మనల్ని బెదిరించినప్పుడు వారితో క్రికెట్ వంటి క్రీడలు ఆడటం అవసరమా అని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. పాకిస్తాన్పై స్పష్టమైన విధానం ఉండాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.