
హైదరాబాద్: దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది చెడుపై మంచి గెలిచినందుకు జరుపుకునే పండుగ. దీపావళిని లైట్ల పండుగ అని పిలుస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని చంపి 14 ఏళ్ల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన నేపథ్యంలో అక్కడి పౌరులు జరుపుకునే పండుగ కూడా అభివర్ణిస్తుంటారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసులు కాల్చడం ఆనవాయితీ. పర్యావరణ వేత్తలు, ప్రముఖులు కాలుష్య స్థాయిని తగ్గించడానికి ప్రజలు టపాసులను ఉపయోగించవద్దని పిలుపునిస్తుంటారు. టపాసులు కాల్చడం ద్వారా వచ్చే పెద్ద శబ్దాల విన్న జంతువులు ఆందోళనకు గరవుతాయని జంతు ప్రేమికులు కూడా అంటుంటారు.
కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ట్విట్టర్లో "నా తోటి భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనకు మరింత కాంతిని ఇస్తుందని, ప్రకాశిస్తుందని ఆశిస్తున్నా. ప్రమిదలను వెలిగించి, టపాసులను పేల్చే ముందు వీటిని గుర్తుంచుకోండి. భయంతో వాటిని చూడటం భయంకరంగా ఉంది" అంటూ టపాసులు పేల్చడంతో వచ్చిన శబ్ధానికి వీధి కుక్కలు భయపడుతున్న వీడియోని పోస్టు చేశాడు.
రోహిత్ శర్మ చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కొందరు దీనికి మద్దతు ఇవ్వగా.. మరి కొందరు మాత్రం కేవలం దీపావళి సమయంలోనే మీకు కాలుష్యం గుర్తొస్తుందా? అంటూ విమర్శిస్తున్నారు. "ఐదు నెలల క్రితం ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు నువ్వు ఇలానే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నావు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ "ఐపీఎల్ను కూడా నువ్వు బాయ్కాట్ చేయాలి. నువ్వు ఐపీఎల్ ఆడకు. అందులోని ఈవెంట్లలో ఇంకా ఎక్కువ టపాసులు కాలుస్తారు" అని చురక అంటించాడు. రోహిత్ 2010లో టపాసులు కాల్చుతూ దీపావలి ఎంజాయ్ చేశాను అంటూ చేసిన ట్వీట్ని నెటిజన్లు ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు.
''ఈసారి కుక్కకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారా?? మరి న్యూ ఇయర్ అప్పుడు కుక్క ఇయర్ బడ్స్ పెట్టుకుంటుందా??'' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా ఎవరికి తోచిన విధంగా సోషల్మీడియాలో నెటిజన్లు రోహిత్ ఆటాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో నవంబర్ 3 నుంచి జరగనున్న టీ20 సిరిస్కు రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో టీ20 సిరిస్కు రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించనున్నాడు.
టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. వరల్డ్కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.
భారత్లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:
1st T20I - New Delhi (November 3) - 7:00 PM (IST)
2nd T20I - Rajkot (November 7) - 7:00 PM (IST)
3rd T20I - Nagpur (November 10) - 7:00 PM (IST)
1st Test - Indore (November 14-18) - 9:30 AM (IST)
2nd Test - Kolkata (November 22-26) - 9:30 AM (IST)
TV Channels: Star Sports Network
Live Streaming: HotStar.com