
ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా:
ఫైనల్ మ్యాచ్లో 21 బంతులెదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ ఓటమికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో యూవీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేసారు. తాజాగా స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ పేజీలో యువీ మాట్లాడుతూ ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ' 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నా. ఆరోజు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే.. నేను ఆడింది దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా భావించే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో. అదే ఒకవేళ వేరే మ్యాచ్ అయ్యుంటే ఇంతలా బాధపడేవాడిని కాదు' అని యువీ తెలిపాడు.

నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు:
'ఫైనల్ మ్యాచ్ తర్వాత చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. నేను ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పుడు మీడియా కళ్లన్నీ నామీదే ఉన్నాయి. వారంతా గట్టి గట్టిగా అరుస్తున్న సమయంలో.. నా చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఒక నేరస్తుడిలా చూశారు. నా ఇంటి మీద రాళ్లతో కూడా దాడి చేశారు. కానీ వారు చేసిన పని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్షణం నాకు నేను అభిమానుల ఆశను మోసం చేపిన నేరస్తుడిలా కనిపించాను. నా జీవితాంతం ఆ సంఘటన గుర్తుండిపోతుంది' అని మాజీ ఆటగాడు యువరాజ్ పేర్కొన్నాడు.

ఆరు బంతులకు ఆరు సిక్స్లు:
2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెండు మెగా టోర్నీల్లోను 'టోర్నీ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్లు కొట్టి సంచలనం సృష్టించాడు. 2011 ప్రపంచకప్ తర్వాత కాన్సర్ బారీన పడిన యూవీ.. లండన్కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొని టీమిండియా తరపున కొన్ని మ్యాచ్లు ఆడినా మునుపటి ప్రదర్శనను చూపించలేకపోయాడు. అందులో 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది.

21 బంతులు ఆడి 11పరుగులు:
బంగ్లాదేశ్ ఢాకా వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ అజింక్య రహానే (3) త్వరగానే పెవిలియన్ చేరగా.. కాసేపు బాగానే ఆడిన రోహిత్ (29) కూడా వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం వీరోచితంగా పోరాడాడు. కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసాడు. యువరాజ్ చివరలో భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో 21 బంతులు ఆడి కేవలం 11పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఎంఎస్ ధోనీ సైతం 7 బంతులు ఎదుర్కొని 4పరుగులే చేసాడు. దీంతో భారత్ 130 పరుగులకే పరిమితమైంది.

సంగక్కర హాఫ్ సెంచరీ:
అనంతరం లక్ష్య చేధనలో సీనియర్ వికెట్ కీపర్ కుమార సంగక్కర (35 బంతుల్లో 52) సహా మిగిలిన వారు ఆకట్టుకోవడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. దీంతో రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలువాలన్న భారత్ ఆశ చెదిరింది. టీమిండియా తరపున యూవీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు.


Click it and Unblock the Notifications












