
హైదరాబాద్: బ్రిస్టల్ నైట్ క్లబ్లో జరిగిన దాడి ఘటనకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను వన్డే సిరిస్ నుంచి కూడా ఆ దేశ క్రికెట్ బోర్డు తప్పించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
ఇప్పటికే ఐదు టెస్టుల యాషెస్ సిరిస్కు దూరమైన బెన్ స్టోక్స్ తాజాగా ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్టు సిరిస్ అనంతరం ప్రారంభం కానున్న వన్డే సిరిస్కు కూడా దూరమైనట్లు ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొలుత స్టోక్స్కు వన్డే జట్టులో బోర్డు చోటు కల్పించింది.
అయితే క్రోన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) నుంచి బెన్ స్టోక్స్ దాడి ఘటన విషయంలో ఎటువంటి క్లియరెన్స్ లభించలేదు. దీంతో అతడిని వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. 'రేపు యూకే నుంచి బయల్దేరే వన్డే బృందంతో కలిసి స్టోక్స్ పయనించడం లేదు. బ్రిస్టల్ ఘటనకు సంబంధించి సీపీఎస్ నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది' అని బోర్డు అందులో పేర్కొంది.
'ఈ నేపథ్యంలో స్టోక్స్ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పిస్తున్నాం. ఒకవేళ స్టోక్స్పై ఎటువంటి కేసు నమోదు కాకపోతే అతన్ని 48 గంటల్లో జట్టులో తిరిగి ఎంపిక చేస్తాం. ప్రస్తుతానికి స్టోక్స్ను వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నాం. అతని స్థానంలో డేవిడ్ మాలన్కు అవకాశం కల్పిస్తున్నాం' అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే బెన్ స్టోక్స్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు మాత్రం ఇప్పటికే ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న బెన్ స్టోక్స్పై గతేడాది సెప్టెంబర్ నెలలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జనవరి 14 నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.