హైదరాబాద్: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్లో జరిగిన తొలి వన్డేలో ఒక్క రనౌట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్కస్ స్టోయినిస్ చేసిన ఒంటరి పోరాటం జట్టుకు లాభించలేదు.
న్యూజిలాండ్తో ఆక్లాండ్లో జరిగిన తొలి వన్డేలో మార్కస్ స్టోయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచేలా అనిపించినప్పటికీ, అవతలి ఎండ్లో ఉన్న హాజిల్ ఉడ్ చిన్నపాటి తప్పిదంతో ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 286 పరుగులు చేసింది. అనంతరం 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 43 ఓవర్లలో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాట్స్మన్ హాజిల్ ఉడ్ అవుట్ కాకుండా చూసేందుకు తానే స్ట్రయికింగ్ తీసుకుంటా వచ్చాడు. వరుసగా మూడు ఓవర్ల పాటు చివరి బంతికి సింగిల్ తీసి తానే స్ట్రయికింగ్ తీసుకున్నాడు.
ఇక్కడ విశేషం ఏమిటంటే హాజిల్ ఉడ్ 26 నిమిషాల పాటు క్రీజులో ఉన్నప్పటికీ, ఒక్క బంతిని కూడా అతడు ఎదుర్కొనివ్వకండా స్టోయినిస్ స్ట్రయిక్ రొటేట్ చేయడం విశేషం. ఈ క్రమంలో పదో వికెట్కు వీరిద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే అందులో హేజిల్ ఉడ్ ఒక్క పరుగు కూడా చేయలేదు.

47వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రెకింగ్కు వద్దామనుకున్న స్టోయినిస్ ప్రయత్నానికి విలియమ్సన్ అడ్డుపడ్డాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ హేజిల్ ఉడ్ను అనూహ్యంగా రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియా ఆరు పరుగులతో ఓటమి పాలైంది. దీంతో స్టోయినిస్పై ఆసీస్ మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.