హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా అప్పుడప్పుడూ భారత్కు వస్తూ ఉంటారు. అంతేకాదు కోల్కతాలో స్టీవ్ వాకు ఓ స్వచ్చంధ సంస్ధ కూడా ఉంది. దానిని పర్యవేక్షించేందుకు కూడా తరచూ వస్తుంటారు.
అయితే అనుకోకుండా మంగళవారం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వారణాసిలోని గంగానదిని ఆయన సందర్శించారు. అయితే ఈసారి స్టీవ్ వా ఓ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్కు రావడం విశేషం. బ్రియాన్ రుడ్ అనే వ్యక్తి చితాభస్మాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం గంగానదిలో కలిపేందుకే స్టీవ్ వా వారణాసికి వచ్చారు.
సిడ్నీలోని సిటీ సెంట్రల్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న పిట్ స్ట్రీట్ మాల్ వద్ద షూస్ పాలిష్ చేసే ఓ వ్యక్తితో స్టీవ్వాకు స్నేహం ఏర్పడింది. అయితే అతడు ఓ అనాథ. రెండు నెలల క్రితం చనిపోవడానికి ముందు అతడు తాను చనిపోతే అస్థికలను హిందూ సంప్రదాయ ప్రకారం పవిత్ర గంగానదిలో కలపాలని అదే తన చివరి కోరిక అని చెప్పాడు. ఇదే విషయాన్ని స్టీవ్ వాకు చెప్పాడు.

అతని చివరి కోరికను స్టీవ్ వా మంగళవారం నెరవేర్చాడు. సిడ్నీ నుంచి తీసుకువచ్చిన అతని అస్థికలను వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో కలిపారు. అనంతరం స్టీవ్ వా మాట్లాడుతూ 'నాకు లభించిన మంచి అవకాశం. నిజంగా ఆ నగరాన్ని సందర్శించాలనుకున్నా. ఇక్కడికి వచ్చినందుకు ఆధ్యాత్మిక భావన కలిగింది. బ్రియాన్ అస్థికలు గంగానదిలో కలపడం చాలా గొప్ప అనుభూతి. ఇది అతని జీవితానికి సంబంధించిన ఒక వేడుకగా మిగిలిపోతుంది' అని పేర్కొన్నాడు.
బ్రియాన్ రుడ్ 18 ఏళ్ల పాటు తన జీవితాన్ని సిడ్నీ వీధుల్లోనే గడపాడు. చిన్నతనంలోనే తన కుటుంబానికి దూరమైన బ్రియాన్ సిడ్నీలోని పలు బాయ్స్ హాస్టల్స్లో పెరిగాడు. 12 ఏళ్ల వయసులో ఓసారి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. అయితే అతడిని ఫాదర్ బాబ్ మాగురె రక్షించి అనాథల కోసం ఏర్పాటు చేసిన ఓ ఆశ్రమంలో చేర్చడం జరిగింది.