
పట్టికలో అగ్రస్థానం:
రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పటిష్ట జట్లను సైతం ఓడించి ఔరా అనిపించింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. డీసీ జట్టు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 22న సన్రైజర్స్తో ఆడనుంది.

ఫైనల్ చేరుతాం:
తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'మేం చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాం. దాంతో మంచి ఫలితాలను పొందుతున్నాం. టోర్నీ ముగింపు దశలో మేం మా అత్యుత్తమ క్రికెట్ను ఆడాలి. మరింత బాగా ఆడతామనే నమ్మకం నాకుంది. ఫైనల్కు చేరాలనే లక్ష్యంతో ఆడాలి. మా ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. కచ్చితంగా ఫైనల్ చేరుతాం. కప్ కూడా కొడతామనే నాకు నమ్మకం ఉంది. అందరం కలిసి ఆడి చాలా నెలలు అవుతోంది. కాబట్టి తిరిగి జట్టును పునర్నిర్మించుకోవాలి. మా జట్టులో మంచి ఆటగాళ్లున్నారు' అని అన్నాడు. గాయం కారణంగా తొలి దశకు శ్రేయస్ అయ్యర్ దూరమవ్వడంతో అతడి స్థానంలో స్మిత్ ఆడాడు.

అయ్యర్ నాణ్యమైన ఆటగాడు:
'శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అది మాకు ఎంతో సానుకూలమైన అంశం. శ్రేయస్ అయ్యర్ నాణ్యమైన ఆటగాడు. అతడు జట్టులో చేరడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో గత 18 నెలల్లో ఇది చాలా ప్రత్యేకమైన సమయం. మహమ్మారిని ఓడించడానికి మనమందరం కలిసి పని చేయాల్సి ఉంది. ఐపీఎల్ ద్వితీయార్ధం ఆడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఐపీఎల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అది కొనసాగించడం మాకు చాలా ముఖ్యం. అందుకోసం మేము గొప్ప క్రికెట్ ఆడాలి' అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.

కెప్టెన్గా పంత్:
కెప్టెన్సీ విషయంలో ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న ఢిల్లీ మేనేజ్మెంట్ ఇటీవలే ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ యజమానులు కిరణ్ కుమార్ గ్రంధి మరియు పార్థ్ జిందాల్ నిర్ణయించారు. భుజం గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్కు కెప్టెన్సీ అప్పగించి ప్రయోగం చేయదలచుకోలేదని, ప్రస్తుతం శ్రేయస్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తాడని ఢిల్లీ యాజమాన్యం తెలిపింది.


Click it and Unblock the Notifications












