
ప్రపంచ క్రికెట్లో అత్యంత గొప్ప వైరం అనగానే మనమైతే ఇండియా, పాకిస్తాన్ అంటాం. కానీ మిగతా దేశాల్లో చాలా వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అని చెప్తాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగే 'యాషెస్ సిరీస్'కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే భారత్లో సిరీస్ గెలవడం అనేది ఈ యాషెస్ కన్నా చాలా ముఖ్యమని ఆస్ట్రేలియా స్టార్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ వచ్చిన అనంతరం.. స్మిత్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు. ఇదేంటని అడగ్గా.. గతంలో తమను బీసీసీఐ మోసం చేసిందంటూ స్మిత్ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తాము భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లో పచ్చదనం ఉన్న పిచ్లు తయారు చేసి, అసలు మ్యాచ్లో స్పిన్ ట్రాక్ తయారు చేసిందని బీసీసీఐపై స్మిత్ అక్కసు వెళ్లగక్కాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్ను భారత్లోనే ఓడించడం ఎంత క్షమలో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న స్మిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి తాజాగా మాట్లాడాడు. 'భారత్లో ఒక టెస్టు మ్యాచ్ గెలవడమే కష్టం. ఇక సిరీస్ ఎలా గెలుస్తాం? ఆ పర్వతాన్ని కనుక మేం అధిగమిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. నన్నడిగితే.. భారత్లో టీమిండియాను కనుక మేం ఓడిస్తే.. అది యాషెస్ సిరీస్ కన్నా గొప్ప' అని స్మిత్ చెప్పాడు. గురువారం నాడు నాగ్పూర్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్లో గెలిచిన జట్టు ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరతుందనే సంగతి తెలిసిందే.