
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి అభిమానుల నమ్మకాన్ని గెలుస్తానని వెల్లడించాడు. తన సతీమణి డానీ విల్స్తో కలిసి దిగిన ఫొటోను ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేస్తూ స్టీవ్ స్మిత్ అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.
'ఆస్ట్రేలియాకు తిరిగి రావడం గొప్పగా ఉంది. నేను కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో దూరంగా ఉన్నా. దాని నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా మంది అభిమానులు ఈమెయిల్స్, లెటర్స్తో నాకు మద్దతు తెలిపారు. మీ నమ్మకాన్ని తిరిగి పొందేందుకు నేను చాలా చేయాలి. ఆ సమయంలో మా తల్లితండ్రులు, నా భార్య ఇచ్చిన మద్దతు వెలకట్టలేనిది. వారికి ధన్యవాదాలతో సరిపెట్టలేను. ప్రపంచంలో ముఖ్యమైనది కుటుంబమే. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు' అని స్మిత్ రాసుకొచ్చాడు.
కేప్ టౌన్ వేదికగా సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్కు యత్నిస్తూ కెమెరాలకు చిక్కడం.. ఆ తర్వాత మీడియా సమావేశంలో స్మిత్ మాట్లాడుతూ ఇది జట్టు వ్యూహంలో భాగమని చెప్పడం ప్రపంచ క్రికెట్ను విస్మయానికి గురి చేసింది.
ఈ బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా పరువు పోవడంతో ఆ దేశ ప్రధాని సైతం వీరిపై చర్యలు తీసుకోవాలని సూచించడం... ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఉదంతానికి సూత్రదారైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లకు ఏడాది.... బాన్క్రాఫ్ట్కు 9 నెలలు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది.
ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బాన్క్రాఫ్ట్కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టకూడదు.
క్రికెట్ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నారు.