హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ మంచి కెప్టెనే అవ్వొచ్చు గాక, తనకు మాత్రం ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ నాయకుడని అజ్యింకె రహానే అన్నాడు. గురువారం మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మీడియాతో మాట్లాడాడు.
'చూశారుగా, అతడు (ధోని) స్మిత్కు సలహాలిచ్చాడు. స్టీవ్ స్మిత్ ఆసీస్కు మంచి కెప్టెన్ అవ్వొచ్చు, నాకు మాత్రం ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ నాయకుడు. స్మిత్ కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడా. అదే ధోనీ కెప్టెన్సీలో మాత్రం విస్తృతంగా ఆడా' అని రహానే చెప్పుకొచ్చాడు.
రహానే చెప్పినట్లు కెప్టెన్ ఎవరైనా మైదానంలో బాస్గా ధోనీయే వ్యవహరించాడు. గురువారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్లో చాలా సందర్భాలలో ఫీల్డింగ్ను ధోనీయే సెట్ చేశాడు. ఆ సమయంలో స్మిత్ మాత్రం బౌలర్లతో మాట్లాడుతూ కనిపించాడు. చాలా సందర్భాల్లో ధోని సలహాలను కెప్టెన్ స్మిత్ తీసుకున్నాడు.

కెప్టెన్సీ నైపుణ్యాల విషయంలో మాత్రం ధోనీకి, స్మిత్కు మధ్య పోలికలు చూసేందుకు రహానే నిరాకరించాడు. ధోని ఇప్పటికీ వరల్డ్ క్లాస్ నాయకుడు, అద్భుత ఆటగాడని రహానే అభివర్ణించాడు. రాబోయే మ్యాచ్లలో కూడా ధోని సలహాలను స్మిత్ తీసుకుంటాడని ఇదే జరుగుతుందని రహానే తెలిపాడు.
ముంబై ఇండియన్స్ జట్టును 184 పరుగులకే నియంత్రించడంలో బౌలర్లు బాగా రాణించారని రహానే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఓపెనర్లు పార్థివ్ పటేల్, జాస్ బట్లర్ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇమ్రాన్ తాహిర్ వెంట వెంటనే తీసిన మూడు వికెట్లు మ్యాచ్ని మలుపు తిప్పాయని అన్నాడు.
తాహిర్, ఆడం జంపాల రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లను వాడుకోవాలన్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చిందని రహానే అన్నాడు. ఐపీఎల్ 10వ సీజన్లో మాత్రం ఆరంభ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం సాధించింది. గురువారం పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది.
185 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది.
ముంబై బ్యాట్స్మెన్లలో జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35.. నాటౌట్), నితీష్ (34) రాణించడంతో ముంబై 184 పరుగులు చేయగలిగింది. పుణె బౌలర్లలో తాహిర్ 3, రజిత భాటియా 2 వికెట్లు తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది.