|
ఆదివారం ఆస్ట్రేలియాకు పయనమైన స్మిత్
తొలి టీ20లో ఓటమిని దగ్గరుండి వీక్షించిన స్టీవ్ స్మిత్... ఆదివారం ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. ఈ సందర్భంలో ఓ ఉద్వేగభరిత సందేశాన్ని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. 'వరుస విజయాలతో భారత్ ఆనందంగా ఉంది. భారత పర్యటనలో మాకు నిరాశే మిగిలింది' అని స్మిత్ పేర్కొన్నాడు.
ప్రణాళిక ప్రకారం సాగలేదు
'మా వన్డే పర్యటన ప్రణాళిక ప్రకారం సాగలేదు. భారత్పై దారుణ పరాభవం మాకు కొన్ని చేదు జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. మమ్మల్ని దురదృష్టం కూడా వెంటాడింది. నాకు గాయం కావడంతో గత మ్యాచ్కు దూరం కావడం ఎక్కువగా బాధించింది. ఇక కొద్ది పాటి విశ్రాంతి తీసుకుంటూ ఆటగాళ్ల పునరావస శిబిరంలో పాల్గొంటూ గాయం నుంచి కోలుకోవడానికి యత్నిస్తా' అని స్మిత్ పేర్కొన్నాడు.
రెండు టీ 20ల్లో మా అదృష్టం మారుతుందేమో
మిగతా రెండు టీ 20ల్లో మా అదృష్టం మారుతుందేమోనని స్మిత్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా 2-1తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజా వన్డే సిరిస్ ఓటమితో ఆసీస్ తన ర్యాంకుని కూడా చేజార్చుకుంది.
నెట్ ప్రాక్టీస్ సమయంలో స్మిత్ భుజానికి గాయం
తొలి టీ20 కోసం రాంచీ చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజానికి గాయమైంది. దీంతో వెంటనే స్మిత్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. పనిలో పనిగా ఎమ్ఆర్ఐ స్కానింగ్ కూడా చేయించారు. అనంతరం పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్టీవ్ స్మిత్ ఫిట్గా ఉన్నాడని తొలి టీ20లో పాల్గొనచ్చని వైద్యులు చెప్పడంతో జట్టు మేనేజ్మెంట్ ఊపిరిపీల్చుకుంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ కోసమే స్మిత్కు విశ్రాంతి
అయినప్పటికీ త్వరలో ఇంగ్లాండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ జరగనున్న నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్ స్మిత్కు విశ్రాంతి ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే స్మిత్ను స్వదేశానికి పంపించివేసినట్లు తెలుస్తోంది. స్మిత్ స్థానాన్ని మార్కస్ స్టోయినిస్తో భర్తీ చేయనున్నామని, ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడు టీ20ల సిరిస్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం అధికారిక ప్రకటన చేసింది.