హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో లీగ్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. వచ్చే జనవరి నెలలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్ జట్టు తరుపున ఆడేందుకు గాను ఆ ఫ్రాంఛైజీ స్టీవ్ స్మిత్ ఒప్పందం చేసుకుంది.
ఇండియా vs దక్షిణాఫ్రికా: ఏడుగురు యువకులే, సమర్ధించుకున్న కోచ్ హరేంద్ర
ఈ మేరకు కొమిల్లా విక్టోరియన్స్ జట్టు కోచ్ మహమ్మద్ సల్హాద్దీన్ మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడని తెలిపాడు. రెండో సీజన్ కోసం జనవరి మధ్యలో స్టీవ్ స్మిత్ జట్టులో చేరనున్నట్లు తెలిపాడు. ఢాకా వేదికగా జరిగే తొలి నాలుగు మ్యాచ్లకు స్మిత్ అందుబాటులో ఉండడు.
ఆ తర్వాత సైల్హట్ వేదికగా జరిగే మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని కోచ్ తెలిపాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) రెండో సీజన్ మొత్తానికి పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ను ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నాడు.
స్మిత్తో పాటు ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ సైతం ఈ టోర్నీలో సైల్హట్ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. బీపీఎల్ రెండో సీజన్ జనవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. కెనడా గ్లోబల్ టీ20 లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆడుతోన్న మూడో టీ20 లీగ్ ఇదే కావడం విశేషం.
దీంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్లో సైతం స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్కు పాల్పడినందుకు గాను స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.