ముంబై: గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపిస్తున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను కొత్త ఫ్రాంఛైజీలు పుణే, రాజ్కోట్ జట్లు విస్మరించాయి. వాట్సన్ను పక్కన బెట్టేయడానికి కారణం ఉంది. అతడిని ఎన్నో ప్రాధామ్య ఆటగాడిగా ఎంచుకున్నప్పటికీ రూ.12.5 కోట్లు చెల్లించవలసి ఉంటుంది.
అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ను రూ.12.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. దీంతో, అతనిని తీసుకుంటే కొత్త జట్లు కచ్చితంగా అంత చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం వాట్సన్ ఫాంలో లేడు. ఫాంలో లేని అతనికి అంత డబ్బు వెచ్చించలేక పక్కన పెట్టారు. వేలానికి వెళ్తే గతంలో కంటే సగం పలికే అవకాశముంది.
అమ్ముడుపోని వాట్సన్.. ధర పలికినంత ఆటగాళ్లకు ఇవ్వరు!
మంగళవారం డ్రాఫ్ట్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ప్రతి ఆటగాడినీ ఓ నిర్ణీత ధరకు ఎంచుకున్నాయి. అయితే, మనకు పైకి కనిపించిన ధర వేరు, ఆటగాళ్లకు ఇచ్చే మొత్తం వేరుగా ఉంటాయి. ఆటగాళ్లు తాజాగా ఎంత ధర పలికినప్పటికీ, గతంలో చెన్నై, రాజస్థాన్ జట్లు ఇచ్చినంత మొత్తాన్నే ఇస్తారు.

గతంలో పాత జట్టులో ఎక్కువ ధర ఉంటే ఆ మొత్తాన్నే చెల్లించాలి. తక్కువ ధర ఉంటే అదే చెల్లించవలసి ఉంటుంది. ధోనీని గతంలో చెన్నై జట్టు రూ.12.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇప్పుడు అతను అదే ధర పలికాడు. కాబట్టి అతనికి ఇచ్చే మొత్తంలో తేడా ఉండదు.
మిగతా ఆటగాళ్లకు చెల్లించే మొత్తంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు... గతంలో ఓ ఆటగాటు రూ.10 కోట్లకు పలికి.. ఇప్పుడు రూ.12 కోట్లకు తీసుకుంటే అతనికి రూ.10 కోట్లే చెల్లిస్తారు. అలాగే, గతంలో రూ.12 కోట్లు ఉండి, ఇప్పుడు రూ.6 కోట్లకు పలికినా.. అతనికి రూ.12 కోట్లే చెల్లిస్తారు.
డ్రాఫ్ట్ విశేషాలు
ఐదుగురు ఆటగాళ్ల కోసం ఇరు జట్లు చెరో రూ.39 కోట్లు ఖర్చు చేశాయి. అయితే జట్ల రూపకల్పనకు ఇరు ఫ్రాంచైజీలు గరిష్టంగా చెరో రూ.66కోట్లు ఖర్చు చేయవచ్చు. తమ ఖాతా లో మిగిలిన రూ.27 కోట్లతో మిగతా ఆటగాళ్లను సాధారణ వేలంలో కొనుక్కుంటాయి.
ఈ పదిమంది ఆటగాళ్లుపోగా మిగిలిన 40 మంది చెనై, రాజస్థాన్ ఆటగాళ్లు వచ్చే ఫిబ్రవరి 6న జరిగే లీగ్ సాధారణ వేలంలో అందుబాటులో ఉంటారు. లీగ్లోని మొత్తం 8 ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లనైనా వద్దనుకుంటే వారిని జట్టు నుంచి విడుదల చేయడానికి, విడుదలైన ఆటగాళ్లను వేరే జట్టు కొనుక్కోవడానికి డిసెంబర్ 15 నుంచి జనవరి 1 వరకూ తొలి విడత ట్రేడింగ్ విండో నిర్వహిస్తారు.
రెండో ట్రేడింగ్ విండో జనవరి 11 నుంచి 22 వర కూ, ఆఖరిగా మూడో ట్రేడింగ్ విండో ఫిబ్రవరి 8 నుంచి 19 వరకూ నిర్వహించనుంది. కొత్త ఫ్రాంచైజీలకు లీగ్ విశేషాలను, జట్లను నడిపించే విధానాలను వివరించేందుకు జనవరి 13, 14 తేదీల్లో శ్రీనగర్ వేదికగా వర్క్షాప్ నిర్వహిస్తారు. వచ్చే సీజన్ ఐపీఎల్ ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు జరుగనుంది.
రెండు ఫ్రాంచైజీలూ చెన్నై ఆటగాళ్లను కొనుక్కోవడానికే ఆసక్తి కనబరిచాయి. ఇరు జట్లు ఎంచుకున్న పదిమంది ఆటగాళ్లలో ఏడుగురు చెన్నైకి చెందినవారే. పదిమందిలో ఐదుగురు (ధోనీ, రైనా, రహానే, జడేజా, అశ్విన్) భారత జట్టు ఆటగాళ్లు ఉన్నారు.
టాప్-10 ఆటగాళ్లలో మెజార్టీ బ్యాటుగాళ్లే. ఆల్రౌండర్లు ఉన్నారు గానీ కేవలం బంతికే పరిమితమయ్యేవారు ఎవరూ లేరు. పది మందిలో ఐదుగురు (జడేజా, అశ్వి న్, డుప్లెసి, ఫాల్క్నర్, బ్రావో) ఆల్రౌండర్లే. ధోనీని పుణె సొంతం చేసుకోవడంతో ఆటోమేటిక్గా ఆ జట్టుకు కెప్టెన్ ఇక అతనే. రాజ్కోట్కు మెకల్లమ్, రైనాల రూపంలో రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
రవీంద్ర జడెజాను డ్రాఫ్టులో రాజ్ కోట్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. రాజ్ కోట్ జడెజాకు సొంత మైదానం. జడెజా ఇంతకుముందు రాజస్థాన్, కొచ్చి, చెన్నై జట్ల తరఫున ఆడాడు. ఇప్పుడు రాజ్ కోట్ తరఫున ఆడుతున్నాడు.
కొత్త ఫ్రాంఛైజీలు రెండూ జట్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. పుణె ప్రధానంగా కెప్టెన్సీ, బ్యాటింగ్ విషయంలో పైచేయి సాధిస్తే, రాజ్కోట్ ఆల్రౌండర్లు, దూకుడైన ఆటగాళ్లను ఎంచుకుంది. ధోని, స్మిత్, డుప్లెసిస్, రహానేలను పుణే ఎంచుకుంది. ఇక అశ్విన్ లాంటి మేటి స్పిన్నర్ కూడా ఉన్నాడు.
రాజ్కోట్ విషయానికి వస్తే.. ఆల్రౌండర్లే ఈ జట్టు బలం. జడేజా, ఫాల్క్నర్, బ్రావోలు బ్యాటు, బంతి, ఫీల్డింగ్తో తమవంతు పాత్ర పోషిస్తారు. రైనా కూడా బౌలింగ్తో, ఫీల్డింగ్తో తనదైన ముద్ర వేస్తాడు. ఇక బ్యాటింగ్లో మెకల్లమ్, రైనాల విధ్వంసం సృష్టిస్తారు.