హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్ను 3-0తో చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టుపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్పై ఆ దేశ మాజీ పేసర్ రాడ్నీ హాగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. టీమ్ ఎంపికను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా వన్డేల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. భారత్ పర్యటనకు ముందు న్యూజిలాండ్తో ఆడిన చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీలో కూడా ఆసీస్ ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జట్టు ఎంపికపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. న్యూస్.కామ్.ఎయుకి ఇచ్చిన ఇంటర్యూలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ రాడ్నీ హాగ్ మాట్లాడుతూ స్మిత్ తన ఫ్రెండ్స్ అందరినీ జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించాడు.

'స్మిత్ తన స్నేహితులను జట్టులోకి తీసుకుంటున్నాడు. అతను కెప్టెనేగానీ సెలక్టర్ కాదు' అని ఈ సందర్భంగా హాగ్ అన్నాడు. అగర్ని అలాగే తీసుకున్నాడని, రెండు వన్డేలు ఫెయిలైన కార్ట్రైట్ ఇంకా జట్టుతోనే కొనసాగుతున్నాడని చెప్పాడు.
'జట్టులో ఎంపికైన మాడిసన్ కూడా అతని ఫ్రెండే. వీళ్లంతా స్మిత్కు క్లోజ్. నువ్వు వాళ్లనే తీసుకుంటే ఎలా? దీనిపై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది' అని హాగ్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు సెలక్షన్ ప్యానెల్ కూడా ఈ నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని హాగ్ స్పష్టం చేశాడు.
అద్భుతమైన ఫామ్లో ఉన్న ట్రెవిస్ హెడ్ను సెలక్టర్లు పట్టించుకోకపోవడంపై కూడా హాగ్ స్పందించాడు. 23 ఏళ్ల హెడ్ గత మూడు ఇన్నింగ్స్ల్లో 57.33 యావరేజిని నమోదు చేశాడు. పాకిస్థాన్పై సెంచరీని కూడా చేశాడు. కాగా, ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరగనుంది.