న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో నవంబర్ 22 నుంచి అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. కంగారూలతో పోలిస్తే భారత జట్టుకు సిరీస్ నెగ్గడం తప్పనిసరి. నవంబర్ 10న ఆస్ట్రేలియాకు టీమిండియా బయలుదేరనుంది.
అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరికొన్ని వారాలే సమయమే ఉన్న నేపథ్యంలో భారత ప్లేయర్ల గురించి ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్టు ఫార్మాట్లో ప్రస్తుత అత్యుత్తమ జట్టు గురించి మాట్లాడుతూ బెస్ట్ ఓపెనర్ గురించి తమ ఆలోచనలు పంచుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రమాదకర ప్లేయర్ అని స్టీవ్ స్మిత్, గొప్ప ప్లేయర్ అని మార్నస్ లబుషేన్ అన్నారు. వరల్డ్ టెస్టు బెస్ట్ 11లో ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఎంపిక చేశారు.

''ప్రపంచ అత్యుత్త టెస్టు జట్టులో రోహిత్ శర్మను ఓపెనర్గా ఎంపిక చేస్తాను. అతను చాలా ప్రమాదకర ప్లేయర్. కొత్త బంతితో మ్యాచ్ను లాగేసుకోగలడు. రోహిత్ తన షాట్లను ఆడగలడు, అలాగే పరిస్థితులకు తగ్గట్లుగా బలమైన డిఫెన్స్ చేయగలడు. అతను బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తాడు'' అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
''రోహిత్ శర్మ గొప్ప ప్లేయర్. అతను ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. అతను పరిస్థితులకు తగ్గట్లుగా ఎలాంటి ఆటను అయినా ఆడగలడు. అతను ఎంతో ఉన్నతంగా ఆడతాడు. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు'' అని లబుషేన్ అన్నాడు. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది. కాగా, గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమిండియానే బోర్డర గవాస్కర్ ట్రోఫీని గెలిచింది.