
హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడతారా లేదా? అన్న విషయంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్, బాన్క్రాప్ట్ల ప్రమేయం ఉందని ఆ దేశ క్రికెట్ స్పష్టం చేసింది.
కేవలం కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బాన్క్రాఫ్ట్ల త్రయానికి మాత్రమే ఈ విషయం గురించి తెలుసని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేపట్టిన విచారణలో వెల్లడైంది. బాల్ టాంపరింగ్ వివాదంలో మిగతా ఆటగాళ్ల ప్రమేయం ఏమాత్రం లేదని, వారంతా అమాయకులేనని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు.
బాల్ టాంపరింగ్ వివాదంలో భాగంగా జట్టులోని అందరి ఆటగాళ్లను విచారించామని ఆయన అన్నారు. దీంతో బుధవారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్ భవితవ్యమేమిటో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురూ స్వదేశానికి పయనం కానున్నారు. వారి స్థానంలో రెన్షా, మ్యాక్స్వెల్, జో బర్న్స్ జట్టులో చేరనున్నారు.
దీంతో దీనిపై స్పందించిన బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ 'క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్, స్మిత్లపై నిషేధం విధిస్తే వాళ్లు ఐపీఎల్ నుంచి కూడా వారిని తప్పిస్తాం. ఇందులో మరో ఆలోచనే లేదు. వాళ్లపై ఎన్నాళ్లు నిషేధం విధిస్తారన్నది అనవసరం. రెండు నెలల నిషేధమైనా సరే వాళ్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేనట్లే' అని ఆయన అన్నారు.
'ఈ చర్చలన్నీ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే డోపింగ్ టెస్ట్లో విఫలమైన రసెల్ ఐపీఎల్లో అవకాశం కోల్పోయాడు. అలాగే ఆ ఇద్దరినీ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిషేధిస్తే ఐపీఎల్ పదకొండో సీజన్లో ఆడే అవకాశం ఉండదు. ఇందులో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసేదేమీ లేదు' అని ఆయన అన్నారు.
ఐపీఎల్లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు, డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ను తప్పించిన ఆ జట్టు యాజమాన్యం అతడి స్థానంలో కొత్త కెప్టెన్గా అజ్యింకె రహానేకు బాధ్యతలు అప్పగించింది.
క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ను దోషిగా తేల్చడంతో సన్రైజర్స్ యాజమాన్యం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే. బాల్ టాంపరింగ్పై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనకు ప్రధాన కారణమైన స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లు దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి పయనమయ్యారు.