
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లపై మాజీ అంపైర్ డారెల్ హార్పర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరికీ బాల్ ట్యాంపరింగ్ చేయడం కొత్తంటూ చెప్పుకొచ్చారు. కానీ, విచారణలో అది అబద్ధమని తేలింది.
2016లోనే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ మ్యాచ్లో భాగంగా బాల్ టాంపరింగ్ చేసిన ఈ ఇద్దరినీ అంపైర్గా ఉన్న డారెల్ హార్పర్ హెచ్చరించాడు. న్యూసౌత్వేల్స్ టీమ్కు ఆడిన ఈ ఇద్దరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హార్పర్ అప్పుడు మ్యాచ్ రిఫరీగా ఉన్న సైమన్ టౌఫెల్కు పంపిన ఈమెయిల్లో చెప్పాడట. ఆ మ్యాచ్ తొలి రోజు వికెట్కీపర్గా ఉన్న పీటర్ నెవిల్కు వార్నర్ పదేపదే బాల్ను నేలకేసి కొడుతూ విసురుతుండటంతో ఏదో చేస్తున్నాడన్న అనుమానం కలిగింది.
ఆ ఘటనపై అలా చేయకూడదంటూ కెప్టెన్ స్మిత్కు అంపైర్లు కూడా చెప్పారట. అయినా వాళ్లు వినకపోవడంతో మరుసటి రోజు ఇదే విషయాన్ని న్యూసౌత్వేల్స్ కోచ్ ట్రెంట్ జాన్సన్కు చెప్పానన్నాడు. ఓ జాతీయ జట్టుకు కెప్టెన్గా ఉండి బాల్ టాంపరింగ్ చేయడం సరికాదని స్పష్టంచేశాను అని హార్పర్ మెయిల్లో వెల్లడించాడు. ఈ మ్యాచ్లో న్యూసౌత్వేల్స్ ఓడిపోయిన తర్వాత సిడ్నీ పిచ్ బాగాలేదని స్మిత్ ఫిర్యాదు చేశాడని, అసలు షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఆడటమే తనకు ఇష్టం లేదని హార్పర్ తెలిపాడు.
ఈ ఘటన జరిగిన సమయంలోనే అటు సౌతాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సౌతాఫ్రికాలో జరిగిన ఘటన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా తమ టీమ్ సంస్కృతిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తుంది. ఇప్పటికే ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న కెప్టెన్ స్మిత్.. తప్పు చేశాను, క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.